మండలిలో రంజైన రాజకీయం: టీడీపీ ట్విస్ట్ తో ఆగిన బిల్లు: ప్రభుత్వం ముందున్న మార్గాలేంటి..!
మూడు రాజధానుల బిల్లు కు శాసన మండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఉదయం 10 గంటలకు మండలిలో బిల్లు ప్రతిపాదించేందుకు ప్రభుత్వ సమాయత్తం అయింది. సరిగ్గా ఆ సమయంలో టీడీపీ నేత యనమల కొత్త అంశం తెర మీదకు తెచ్చారు. రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చామని..దీని పైన చర్చకు అనుమతించాలని కోరారు. దీనికి మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఆ తరువాత అధికార.. ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సాగాయి. ఛైర్మన్ టీడీపీ ఇచ్చిన రూల్ 71 మోషన్ కింద చర్చకు అనుమతించారు. దీంతో..ఎప్పుడూ లేని విధంగా మంత్రులు..వైసీపీ ఎమ్మెల్సీలు పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ఛైర్మన్ పైన మంత్రులు సీరియస్ వ్యాఖ్యలు చేసారు. మూడు సార్లు మండలి ఇప్పటి వరకు వాయిదా పడింది. దీంతో..ప్రభుత్వం ఈ బిల్లులు ఆమోదం విషయంలో ప్రభుత్వం ముందు ఉన్న మార్గాలేంటి.. రూల్ 71 కింద చర్చ కొనసాగుతుందా.. లేక బిల్లులు ప్రతిపాదిస్తారా..లేక ప్రభుత్వం మరో ప్రత్యామ్నాయం వైపు చూస్తుందా అనేది ఇప్పుడు ఉత్కంఠకు కారణమైంది.
సభలో రాజధాని బిల్లులు ప్రవేశ పెట్టనీయకుండా..
అసెంబ్లీలో సులువుగా అమోదించిన మూడు రాజధానుల బిల్లులను..మండలిలో ఉదయం నుండి ప్రవేశ పెట్టటానికి ఇబ్బంది పడుతోంది. టీడీపీ వ్యూహాల పైన ముందుగానే అంచనా వేసినప్పటికీ..ఎవరూ అంచనా వేయని విధంగా టీడీపీ ఏపీ శాసనమండలికి మాత్రమే అవకాశం ఉన్న అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. దీనిని ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో..వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రులు స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి ఛైర్మన్ ... రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో..పార్టీ ఎమ్మెల్సీతో ఫ్లోర్ లీడర్ యనమల సమావేశమయ్యారు. కానీ, మంత్రులు మాత్రం మండలి ఛైర్మన్ తీరు పైన మండిపడుతున్నారు. సభలో గందరగోళం నడుమ ఛైర్మన్ ఇప్పటి వరకు సభను మూడు సార్లు వాయిదా వేసారు.
ఛైర్మన్ రూల్ 71 కే మొగ్గు చూపితే..
ఛైర్మన్ ఇప్పటికే టీడీపీ ప్రతిపాదించిన రూల్ 71 మోషన్ పైన చర్చకు అనుమతించారు. టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ దీని పైన చర్చకు ప్రారంభించారు. ఆ సమయంలో మంత్రలతో పాటుగా వైసీపీ ఎమ్మెల్సీలు సైతం పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. మంత్రి బొత్సా ఛైర్మన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయవద్దంటూ వ్యాఖ్యానించారు. వాటిని ఛైర్మన్ స్థానం లో ఉన్న షరీఫ్ ఖండించారు. గందరగోళం నడుమ సభను ఛైర్మన్ మరోసారి వాయిదా వేసారు. ఛైర్మన్ తనకున్న విచక్షణాధికారంతో బిల్లులను ప్రవేశ పెట్టేందుకు అనుమతించాలని మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఛైర్మన్ తిరిగి సభ ప్రారంభమైన తరువాత టీడీపీ ప్రారంభించిన చర్చనే కొనసాగిస్తే..వైసీపీ మరోసారి అడ్డుకొనే అవకాశం ఉంది. చర్చ పూర్తి చేస్తే..ఇక, మండలిలో ప్రభుత్వం వెంటనే ఈ బిల్లులను ప్రతిపాదించే అవకాశం ఉండదు. దీంతో..సభ జరగకుండా వాయిదా వేస్తే..తిరిగి రేపు కూడా మండలిలో తిరిగి బిల్లులు ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉంది. అయితే, టీడీపీ రూల్ 71 మోషన్ కింద చర్చ ను ప్రారంభించి ఉండటంతో..తొలుత ప్రభుత్వ బిల్లులకు అవకాశం ఇవ్వటం కష్టమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలేంటి..
టీడీపీ రూల్ 71 మోషన్ ను సభలో తీసుకొచ్చి..చర్చను ఇనిషియేట్ చేయటంతో..ఇక ప్రభుత్వ బిల్లులు ప్రవేశ పెట్టేందుకు ఇప్పటికైతే అవకాశాలు లేదనే భావన వ్యక్తం అవుతోంది. బుధవారం వరకే సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించటంతో..రేపు కూడా మరోసారి మండలిలో బిల్లు ప్రతిపాదించే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. ఈ రోజు..రేపు ఇదే పరిస్థితి కొనసాగితే..ఇక, ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు ఆలోచన చేయక తప్పని పరిస్థితి. ఈ రోజు మండలిలో బిల్లు తిరస్కరించినా..బుధవారం అసెంబ్లీలో మరోసారి ప్రవేశ పెట్టి ఆమోదించాలనేది తొలుత ప్రభుత్వ వ్యూహం. ఇక, ఇప్పుడు అసలు బిల్లు ప్రతిపాదనకే ఛాన్స్ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఈ రోజు రేపు ప్రయత్నించి..సాధ్యం కాకుంటే ఇక..ప్రత్యేకంగా బుధవారమే ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఆర్డినెన్స్ జారీకి అవకాశం ఉండదు. ఆర్డినెన్స్ జారీ చేయాలన్నా సభ నిరవధింకంగా వాయిదా పడాల్సిందే. ఇప్పటికే ముందస్తుగానే శాసనసభలో తీర్మానం సైతం ఆమోదించి ఉండటంతో..అది కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం. అయితే, ఆర్డినెన్స్..తీర్మానం పైన ఎవరైనా న్యాయ సమీక్షకు వెళ్తే ఎంతవరకు నిలుస్తాయ నే చర్చ సైతం ఇప్పుడు చర్చకు కారణమైంది. మొత్తంగా రాజధానుల బిల్లుల పైన అధికార ప్రతిపక్షాల మధ్య రంజైన రాజకీయానికి మండలి వేదికగా మారింది.