50 కాదు.. మూకుమ్మడిగా 150 మంది దాడి చేసినా రెడీ.. జగన్ సర్కార్పై ఘాటుగా చంద్రబాబు
రైతు భరోసాపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. మీ పత్రిక ఈనాడులో కూడా ప్రకటనలు ఇస్తామంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. సీఎం వ్యాఖ్యలపై చంద్రబాబు అభ్యంతరం తెలుపుతూ సాక్షి పేపర్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దాంతో అంబటి రాంబాబు జోక్యం చేసుకోని చంద్రబాబు వయసుపై కామెంట్ చేశారు. ఇలా అధికార పక్షం సభ్యుల దాడి నేపథ్యంలో చంద్రబాబు ఘాటుగా స్పందిస్తూ..
రుణమాఫీపై చంద్రబాబు క్లారిటీ
రైతు రుణమాఫి విషయంలో తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాను. వ్యవసాయం కోసం తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాను. మిగితా విషయాల కోసం బంగారం తాకట్టు పెడితే పట్టించుకోలేదు. అందరికీ మాఫీ అని చెప్పలేదు. నేను మీలా అబద్దాలు చెప్పలేదు. నేను వ్యవసాయం దండగ అని చెప్పలేదు. ఇదే విషయంలో సీఎం వైఎస్ఆర్ అంటే నిరూపించమని సవాల్ చేశాను అని చంద్రబాబు అన్నారు.
రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ అని వైఎస్ జగన్
రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేస్తాం. ఆ నంబర్కు ఫోన్ చేసి ధాన్యం అమ్ముకోవాలి. గురువారం పేపర్లలో ప్రకటన ఇస్తాం. మీ ఈనాడు పత్రికలో ప్రకటన ఇస్తాం అని జగన్ చెప్పిన మాటలపై చంద్రబాబు స్పందిస్తూ.. ఇప్పటికైనా సాక్షి పేపర్ను నమ్మరని స్వయంగా సీఎం గ్రహించారు. ఈనాడుకు ప్రకటన ఇస్తామని చెప్పడం సంతోషం. సాక్షి కాకుండా ఈనాడుకిస్తే ప్రజలు కూడా నమ్ముతారు. సాక్షి కాదు.. అసాక్షి అని చంద్రబాబు అన్నారు.
150 మందికైనా సమాధానం చెబుతా
సీఎం జగన్ చేసిన ప్రకటనపై చంద్రబాబు స్పందిస్తూ.. ఈనాడుకి ప్రకటనలు ఇస్తానని చెబితే సంతోషించే వాడిని. కాని మీ పత్రిక అంటూ సీఎం జగన్ ఎగతాళి చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదు. స్వయంగా సాక్షి పత్రికను వైఎస్ జగన్ నమ్మె పరిస్థితి లేదు. అలాంటి పత్రికలో ప్రకటనలు ఇచ్చినా నమ్మరు. నాపై 50 మంది మూకుమ్మడిగా కాదు.. 150 మంది మాటల దాడి చేసినా టీడీపీ భయపడదు. ఎంతమందికైనా సమాధానం చెబుతానని సవాల్ విసురుతున్నాను అని చంద్రబాబు అన్నారు.
చంద్రబాబుపై అంబటి రాంబాబు
చంద్రబాబు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. చంద్రబాబుకు 70 ఏళ్ల వయసు. ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. మీ ప్రచార పత్రిక ఈనాడుకు కూడా ప్రకటన ఇస్తాం అని సీఎం జగన్ అంటే.. ఈనాడుకు బదులు సాక్షి.. సాక్షి అనడం ఆయన మతిమరుపుకు నిదర్శనం అని అంబటి అన్నారు. చంద్రబాబుతో మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతున్నది అని అంబటి సెటైర్లు వేశారు.