ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా.. నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే.. ఇక ఏపీలో స్ట్రిక్ట్
విజయవాడ : ప్రైవేట్ ట్రావెల్స్పై కొరడా ఝలిపించేందుకు ఏపీ సర్కార్ సన్నద్ధమవుతోంది. రూల్స్ బ్రేక్ చేస్తే పర్మిట్లు కట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆ క్రమంలో రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశంలో పలు అంశాలు ప్రస్తావించారు. ఇష్టారాజ్యంగా బస్సులు నడపడం సరికాదంటూ ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులను హెచ్చరించారు మంత్రి. ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు.
రూల్స్ బ్రేక్ చేస్తే అంతే సంగతులు.. ప్రైవేట్ ట్రావెల్స్కు హెచ్చరిక.!
ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తున్న తీరుపై విజయవాడలోని రవాణా శాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఆ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే ట్రావెల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అడ్డగోలుగా బస్సులు నడిపే విధానానికి స్వస్తి పలకాలని సూచించారు.
ప్రైవేట్ బస్సులపై నిఘా పెంచాలని, విస్తృతంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. పర్మిట్ పత్రాలు లేకుండా తిరుగుతున్న బస్సులను సీజ్ చేయాలన్నారు. టూరిస్ట్ పర్మిట్లు తీసుకుని కాంట్రాక్ట్ క్యారేజీలుగా బస్సులు నడపడం చట్టరీత్యా నేరమన్నారు.
ప్రతిపక్షం ఉంటేనే సభకు హుందాతనం అంటున్న జగన్.. మరి కేసీఆర్ ఎందుకిలా?
అధికారులకు దిశానిర్దేశం.. అలాంటి బస్సులను స్వాధీనం చేసుకోండి..!
ప్రభుత్వం పట్టించుకోదని ఇష్టారాజ్యంగా బస్సులు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. ప్రైవేట్ ట్రావెల్స్కు సంబంధించిన బస్సుల తనిఖీలు, రహదారి ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రయాణానికి ముందే ట్రావెల్స్ బస్సుల్లో ప్యాసింజర్ల జాబితా తయారుచేయాలన్నారు. రూల్స్ ఉల్లంఘించి నడిపే బస్సుల్ని స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
జాతీయ రహదారులపై ముమ్మర తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. స్టేజి క్యారేజీలుగా బస్సులను నడిపేవారు వెంటనే ఆపేయాలని సూచించారు. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామన్న మంత్రి కేంద్రం నుంచి కొంతమేర నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం.. 100 కోట్ల రివాల్వింగ్ ఫండ్..!
రోడ్డు ప్రమాదాల నివారణకు తమ ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు మంత్రి. ఆ మేరకు ప్రమాదాలు నివారించడానికి 100 కోట్ల రూపాయల రివాల్సింగ్ ఫండ్ ఇచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ అంగీకరించినట్లు తెలిపారు. ప్రమాదాలు జరిగాక బాధ పడేకంటే.. వాటిని నివారించే దిశగా అధికారులు కృషి చేయాలని కోరారు.
అదలావుంటే ఆర్టీసీ గురించి కూడా ప్రస్తావించారు మంత్రి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు అధ్యయనం జరుగుతోందని తెలిపారు. దానికోసం వేసిన కమిటీ సీఎం ఆదేశాలతో పాటు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత 90 రోజుల్లో నివేదిక ఇవ్వనుందన్నారు. దాని తర్వాత తుది నిర్ణయం వెల్లడిస్తామన్నారు.