Bharat Bandh: అంబానీ..అదానీ: ఎరుపెక్కిన బెజవాడ: ఉత్తరాంధ్ర సహా వామపక్ష నేతల ర్యాలీల హోరు
విజయవాడ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అమలులోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. భారత్ బంద్లో పాల్గొంటున్నారు. వ్యవసాయాన్ని కార్పొరేటీకరించడంలో భాగంగా ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రైతుల ఆందోళనలకు మద్దతుగా బంద్లో పాల్గొంటున్నాయి. బీజేపీ, ఎన్డీఏ మిత్రపక్షాలు మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు రైతులకు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశాయి. రోడ్ల మీదికి వచ్చి.. నిరసన ప్రదర్శనలను చేపట్టాయి.
Recommended Video
విజయవాడ సహా..
భారత్ బంద్లో భాగంగా- విజయవాడలో వామపక్ష నేతలు భారీ ర్యాలీని నిర్వహించారు. వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాల నేతలు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. ఎర్రజెండాలను ప్రదర్శిస్తున్నారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ (పీఎన్బీఎస్) బైఠాయించారు. విజయవాడ నగర వ్యాప్తంగా ర్యాలీ చేపట్టారు. సీపీఎం, సీపీఐ సహా తొమ్మిది వామపక్ష నేతలు, వాటి అనుబంధ సంఘాలు ఎస్యూసీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ, సీపీఐ (ఎం-ఎల్) ప్రతినిధులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో..
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు సహా పలువురు నేతలు ఈ ప్రదర్శనలకు సారథ్యాన్ని వహించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో వామపక్షాల నేతలకు గట్టిపట్టు ఉన్న విజయనగరం జిల్లా పార్వతీపురంలో బంద్ ప్రభావం కనిపించింది. లెఫ్ట్ పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్లపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కార్పొరేట్ల చేతుల్లో వ్యవసాయం..
దేశానికి వెన్నెముకగా భావించే వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని వామపక్ష నేతలు మండిపడ్డారు. ముఖేష్ అంబానీ, అదానీల వంటి చేతుల్లో వ్యవసాయ రంగాన్ని పెట్టడానికే ఓపెన్ మార్కెట్ వ్యవస్థను తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతులు తమ వ్యవసాయోత్పత్తులను ఎక్కడైనా అమ్ముకోవచ్చనే విధానం వల్ల మార్కెట్ యార్డుల వ్యవస్థ విధ్వంసానికి గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటిత రంగం కాస్తా.. అసంఘటితంగా మారుతుందన విమర్శించారు.
మార్కెట్ యార్డుల స్థానంలో సూపర్ మార్కెట్లు..
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వల్ల భవిష్యత్తులో మార్కెట్ యార్డులు కనిపించబోవని అన్నారు. వాటి స్థానంలో అంబానీల సూపర్ మార్కెట్లు వెలుస్తాయని, వాటి కోసమే బీజేపీ నేతలు తపిస్తున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని కార్నొరేట్ మయం చేయడానికి ఉద్దేశించిన ఈ మూడు చట్టాలను ఇప్పుడే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, లేదంటే అవి విషవృక్షంలో పాతుకుపోతాయని అన్నారు. రైతులు కాస్తా.. రైతు కూలీలుగా మారుతారని, ప్రతి వస్తువును కార్పొరేట్లు నిర్ణయించిన ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు.