మళ్లీ గ్యాంగ్ వార్... రెచ్చిపోయిన రౌడీ మూకలు... బెజవాడలో కలకలం...
కొద్దిరోజుల క్రితం విజయవాడలో సందీప్-కేటీఎం పండు మధ్య జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇంకా మరవకముందే తాజాగా నగరంలో మరో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. షేక్ నాగుల్ మీరా అలియాస్ మున్నా,రాహుల్కి చెందిన ఇరు వర్గాలు పరస్పర దాడులు చేసుకున్నాయి. కత్తులు,కర్రలు,మారణాయుధాలతో రెచ్చిపోయాయి.ఈ వ్యవహారం పోలీసుల వద్దకు చేరడంతో ఇరు వర్గాలకు చెందిన పలువురిని అరెస్ట్ చేశారు.
ఆప్తులు కాబట్టే మౌనమా ? విజయవాడ అగ్నిప్రమాదంపై చంద్రబాబు తీరును తప్పుబట్టిన శ్రీకాంత్రెడ్డి
అసలేం జరిగింది...
విజయవాడలోని కేదారేశ్వరపేట ఖుద్దూస్ నగర్కి షేక్ నాగుల్ మీరా,రాహుల్ అనే యువకులు చెరో గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య గతంలో పాత గొడవలు,కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జులై 31న రాహుల్ వర్గం నాగుల్ మీరా వర్గంపై కత్తులు,కర్రలతో దాడి చేసింది. ఈ దాడిలో రాహుల్తో పాటు అయోధ్య నగర్కు చెందిన వినయ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ వర్గం దాడితో ఆగ్రహంతో ఊగిపోయిన నాగుల్ మీరా వర్గం అదే రోజు రాత్రి ఎదురు దాడికి దిగింది.
రాహుల్ వర్గంపై నాగుల్ మీరా వర్గం దాడి...
జులై 31 రాత్రి నాగుల్ మీరా వర్గానికి చెందిన సాయి,ఈసబ్ తదితరులు అయోధ్యనగర్కి వెళ్లి రాహుల్,వినయ్ తదితరులపై కత్తులు,మారణాయుధాలతో దాడి చేశారు. పరస్పర దాడుల తర్వాత రెండు గ్యాంగ్స్ సైలెంట్ అయిపోయాయి. ఇదే క్రమంలో పుట్టా వినయ్(18) అనే యువకుడు నాగుల్ మీరా వర్గం తనపై దాడి చేసినట్లుగా అజిత్సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నాగుల్ మీరా(25)తో పాటు షేక్ ఈసబ్(26),లావేటి సాయి కుమార్(24),సాయి పవన్(20),కంది సాయి(20)లపై కేసు నమోదైంది.
పలువురి అరెస్టు...
పుట్టా వినయ్ కేసుతో నాగుల్ మీరా గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. సోమవారం(అగస్టు 10) వీరిని అరెస్టు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన నాగుల్ మీరా గ్యాంగ్ నుంచి ఓ బైక్,కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. మరోవైపు షేక్ నాగుల్ మీరా కూడా ఆదివారం(అగస్టు 9) సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హెచ్చరిస్తున్న పోలీసులు...
నాగుల్ మీరా ఫిర్యాదుతో ఖుద్దూస్నగర్కి చెందిన రాహుల్,అతని అనుచరులైన సాయి కిరణ్,పుట్టా వినయ్,వికాస్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు యువకుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. వీరిని కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బెజవాడలో మళ్లీ రౌడీ గ్యాంగ్ మూకలు హల్చల్ చేస్తుండటం నగరానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేస్తోంది. ఈ నేపథ్యంలో నగరంలో ఎలాంటి గ్యాంగ్స్ను ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గూండా గిరీ,రౌడీయిజం వదిలిపెట్టి ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ బతకాలని సూచిస్తున్నారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు.