టీడీపీకి మరో షాక్ ... వైసీపీలోకి అయ్యన్న సోదరుడు జంప్ !!
ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్న టిడిపిని వీడి వెళ్లడానికి నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. ఒకపక్క టిడిపి అధికార పార్టీని ఎదుర్కొంటూనే, మరోపక్క సొంత నేతలు కాపాడుకోడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీలో కొనసాగితే అధికార పార్టీ నుండి వేధింపులు ఎక్కువ అవుతాయని, అనవసరమైన కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఒక్కొక్కరు పార్టీ నుండి జంప్ అంటున్నారు.
సోదరుడి పుట్టిన రోజు నాడే టీడీపీకి రాజీనామా చేసిన అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు
ఇక తాజాగా తెలుగుదేశం పార్టీకి మరొక ఎదురు దెబ్బ తగలనుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే రాజీనామా చేసిన మరొక కీలక నేత వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు తెలుగుదేశం పార్టీకి అయ్యన్న పుట్టినరోజు నాడు సోదరుడికి బర్త్ డే గిఫ్ట్ గా పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన తాజాగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారని చర్చ జరుగుతోంది.
నేడు వైసీపీలో చేరిక.. సోదరుల మధ్య కలహాలే కారణం
నవంబర్ 4 వ తేదీన అంటే నేడు వైసీపీ పార్టీ లో చేరడానికి సన్యాసి పాత్రుడు రెడీ అవుతున్నట్లు గా ప్రధానంగా టాక్ వినిపిస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆయన తన కుటుంబసభ్యులు, ఇతర నేతలతో కలిసి తాడేపల్లి కి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈమేరకు సన్యాసి పాత్రుడు కూడా ఒక అధికారిక ప్రకటన చేశారు.అంతేకాకుండా గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అయ్యన్న పాత్రుడు, సన్యాసి పాత్రుడు ల మధ్యన గత కొంత కాలంగా నడుస్తున్న వైరం ఇప్పుడు సన్యాసి పాత్రుడిని వైసీపీలో చేరేలా చేస్తుంది. ఏకంగా సన్యాసి పాత్రుడు అయ్యన్నను హతమార్చేందుకు ప్రయత్నం చేశాడని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
నర్సీపట్నం మున్సిపాలిటీపై మంచి పట్టున్న సన్యాసి పాత్రుడు
దీంతో సోదరుల మధ్య రగులుకున్న చిచ్చు సన్యాసి పాత్రుడిని పార్టీకి గుడ్ బై చెప్పేలా చేసింది. ఇక అంతే కాకుండా వైసీపీ నేతలు కూడా సన్యాసి పాత్రుడుని వైసీపీలో చేర్చుకోవడానికి బాగా పట్టుబట్టినట్లు గా తెలుస్తుంది. ఇందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీ పై సన్యాసి పాత్రుడు కి మంచి పట్టు ఉండటంతో వైసిపి నేతలు సన్యాసి పాత్రుడిని పార్టీలోకి తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు .
ఫలించిన వైసీపీ నేతల ప్రయత్నం .. టీడీపీకి షాక్
చివరకు వైసీపీ నేతల ప్రయత్నాలు ఫలించి సన్యాసి పాత్రుడు వైసీపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.అయితే గత ఎన్నికల ముందే సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరతానని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ అప్పుడు వైసీపీ లో చేరడానికి సన్యాసి పాత్రుడు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఫైనల్ గా నేడు అయ్యన్నపాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీ తీర్థం పుచ్చుకోవడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టిడిపి కి పెద్ద షాక్ అని చెప్పాలి.