కోడెల అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపులో తొలి వికెట్: చీఫ్ మార్షల్ పై బదిలీ వేటు: నెక్స్ట్ ఎవరో?
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు అసెంబ్లీ ఫర్నిచర్, ఇతర సామాగ్రిని తన సొంత అవసరాల కోసం ఇంటికి తరలించిన వ్యవహారంలో తొలి వికెట్ పడింది. చీఫ్ మార్షల్ గణేశ్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను అక్టోపస్కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. ఫర్నిచర్, ఇతర సామాగ్రి తరలింపులో గణేశ్ బాబు పాత్ర కీలకంగా మారినట్లు ప్రభుత్వం అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. అసెంబ్లీ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత గణేశ్ బాబుదే. అయినప్పటికీ- ఫర్నిచర్ ను ఆయనే దగ్గరుండి మరీ కోడెల శివప్రసాద్ రావు ఇంటికి తరలించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
చిరంజీవి: సినిమాల్లో ట్రెండ్ సెట్ చేశారు..రాజకీయాల్లో ఫాలో అయ్యారు.. అందుకే
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ప్రభుత్వం.. గణేశ్ బాబు పాత్రపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ఆయనను విచారించగా.. పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. తాను పలుమార్లు వారించినప్పటికీ.. కోడెల వినిపించుకోలేదని గణేశ్ బాబు విచారణ బృందం ఎదురుగా స్పష్టం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ- దీనిపై గణేశ్ బాబు సంబంధిత కార్యదర్శికి గానీ, ఇతర సిబ్బందికి గానీ కనీస సమాచారం ఇవ్వలేదని అంటున్నారు. ఈ ఒక్క కారణంతోనే విచారణ బృందం అధికారులు గణేశ్ బాబు పాత్ర కీలకంగా మారినట్లు గుర్తించారని చెబుతున్నారు. ఈ బదిలీల వ్యవహారం గానీ, సస్పెన్షన్ల వేటు గానీ గణేశ్ బాబు ఒక్కరితోనే ఆగేలా కనిపించట్లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. స్పీకర్ కార్యాలయ సిబ్బందిపైనా వేటు పడే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. తొలిరోజుల్లో హైదరాబాద్ లో కొనసాగిన అసెంబ్లీని కార్యకలాపాలను అనంతరం రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో కొత్తగా నిర్మించిన భవన సముదాయానికి బదిలీ చేశారు. ఆ సమయంలో హైదరాబాద్ లోని అసెంబ్లీ భవనం నుంచి ఫర్నిచర్ ను అమరావతికి తరలించాల్సి ఉండగా.. కోడెల శివప్రసాద్ రావు దాన్ని సత్తెనపల్లిలోని తన నివాసం, గుంటూరులోని క్యాంపు కార్యాలయానికి తీసుకెళ్లారు. వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కోడెలే అంగీకరించారు. అసెంబ్లీ కార్యదర్శి ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ తతంగం వెలుగు చూసింది.