పోకిరీ డైలాగులతో దద్దరిల్లిన ఏపి అసెంబ్లీ ..! బుల్లెట్ దిగిందా లేదా అన్న మంత్రి అనిల్ కుమార్..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. రైతులకు సున్నా వడ్డీ పథకంపై సీఎం జగన్ సవాల్ విసిరారు. దీనికి ప్రతిపక్ష నేత చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలంటూ మంత్రి అనిల్కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. మేం అడిగిన దానికి సమాధానం చెప్పడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అడిగితే సమాధానం చెప్పకుండా పారిపోయారని విమర్శించారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాదు..
బుల్లెట్ దిగిందా లేదా? అంటూ వ్యాఖ్యానించారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశంలో ప్రశ్నోత్తరాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ప్రాజెక్టులపై కమిటీలు వేశామని, త్వరలో నివేదికలు వస్తాయని అన్నారు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. కమిటీ నివేదికలు వచ్చాక అన్ని విషయాలు బయటకొస్తాయని, అనంతరం రివర్స్ టెండరింగ్పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అంచనాలను పెంచుకుంటూ పోయిందని మండి పడ్డారు. పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ పూర్తి చేస్తారన్నారు. వైఎస్రాజశేఖర్రెడ్డి హయాంలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేశారు.
Recommended Video
రాష్ట్రంలో కరవు పరిస్థితులు తలెత్తడానికి టీడిపి అసమర్థ పాలనే కారణమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో కరవు పరిస్థితిపై శాసనసభలో సీఎం జగన్ ప్రసంగించిన తర్వాత బొత్స మాట్లాడారు. పలు ప్రాంతాల్లో తాగడానికి నీరు లేని దుస్థితికి తెదేపా పాలనే కారణమన్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పటి ప్రతిపక్షానికి చాలా ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని బొత్స చెప్పారు.
సభలో గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆయన హితవు పలికారు. సీఎం జగన్ ఉద్దేశిస్తూ 'నా అనుభవమంత వయసు లేదు' అంటూ చంద్రబాబు మాట్లాడటాన్ని బొత్స తప్పుబట్టారు. సభా నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం అదేనా అని ప్రశ్నించారు. ప్రజలు అవకాశమివ్వబట్టే జగన్ సీఎం అయ్యారని చెప్పారు. తెదేపా సభ్యులు సంయమనం పాటించాలని.. సభా సంప్రదాయాలను ఉల్లంఘించే వారిపట్ల స్పీకర్ కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. చంద్రబాబు ఎందుకు సహనం కోల్పోతున్నారో అర్థం కావడం లేదని బొత్స వ్యాఖ్యానించారు.