జగన్ కోసం కమ్మవాళ్లు కూడా ప్రాణాలిస్తారు.. చంద్రబాబుకు ఇంతకన్నా రాజకీయ పతనమేముంది?: మంత్రి కన్నబాబు
''కులీ కుతుబ్ షా మాదిరిగా ఒక మహానగరాన్ని నిర్మించాలని, శాశ్వతమైన కీర్తి దక్కాలని ఎవరైనా కోరుకోవడంలో తప్పులేదు. చేసే పనిలో ఆత్మ ఉంటే.. ప్రజలు కూడా హర్షిస్తే.. కీర్తి దానంతటదే వస్తుంది. బయటి ప్రపంచమంతా అమరావతిని పర్యావరణం నాశనం చేసే నగరంగానే చూస్తున్నారు తప్ప.. చంద్రబాబు చెప్పినట్లు అంతర్జాతీయ ప్రమాణాలున్న కలల నగరంగా చూడటంలేదు. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు చంద్రబాబు ప్రాణం అమరావతిలో ఉంది. ఇలా చట్ చేసిన వెంటనే జోలె పట్టే స్థాయికి దిగజారిపోయారు'' అంటూ ప్రతిపక్ష నేతపై మంత్రి కన్నబాబు సెటైర్లు వేశారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలివి..
బాబును నేలకు దింపిది జగనేకదా..
తన మీద కోపంతోనో, ఒక సామాజిక వర్గం మీద కోపంతోనో రాజధానిని మార్చొద్దంటూ చంద్రబాబు వినిపిస్తోన్న కొత్త వాదనపై మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ఒకప్పుడు 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పుతానన్న చంద్రబాబును ఇవాళ 29 గ్రామాల్లో జోలెపట్టేస్థాయికి దింపింది సీఎం జగనే అని, అలాంటప్పుడు ఆయన చంద్రబాబుపై కోపం పెంచుకుంటారన్న మాటకు అర్థమేలేదని కన్నబాబు చెప్పారు. 29 రాష్ట్రాల నుంచి 29 గ్రామాల స్థాయికి చంద్రబాబు పడిపోయాడంటే అంతకన్నా రాజకీయ పతనం ఇంకేముంటుందని ఎద్దేవా చేశారు.
ఒక సామాజిక వర్గం అనేది తప్పుడు మాట..
ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయడానికే రాజధానిని తరలిస్తున్నారన్న వాదనను మంత్రి కన్నబాబు తోసిపుచ్చారు. మూడు పంటలు పండే భూముల్లో రాజధాని నిర్మించొద్దని అప్పటి శివరామకృష్ణ కమిటీ నుంచి నిన్నటి హైపవర్ కమిటీ దాకా సూచించాయని, అయినాసరే వినకుండా గ్రీన్ ఫీల్డ్సిటీ పద్దతిని ఎంచుకుని చంద్రబాబు ప్రభుత్వం బొక్కబోర్లా పడిందని, కనీసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్లు కూడా ఇవ్వలేదని మంత్రి గుర్తుచేశారు. సీఎం జగన్ చుట్టూ ఉండేవాళ్లలో చంద్రబాబు సమాజికవర్గానికి చెందినవాళ్లు కూడా ఉన్నారని, రఘురాం, కొడాలి నాని లాంటి వందలమంది అభిమానులు జగన్ కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడబోరని తెలిపారు.
ఈ మంత్రాలు పనిచేయవు..
తన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఏరోజూ ప్రజల కోసం ఆలోచించని చంద్రబాబు నాయుడు సడెన్ గా అమరావతి కోసం జోలె పట్టడంలో పెద్ద మతలబు ఉందని.. కులాల పేరుతో, మతాల పేరుతో, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు అనాలోచిత రాజకీయ నిర్ణయాల కారణంగానే ఏపీ దారుణంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.