సీఎం జగన్ మైండ్గేమ్ ఎక్స్పర్ట్.. వరుణుడిని కూడా జైలుకు తీసుకెళ్తాడు.. చంద్రబాబు ఫైర్
రైతు భరోసా అంశం ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళానికి దారి తీసేలా చేసింది. సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అంతేకాకుండా చంద్రబాబుపై మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్రమైన విమర్శలు చేయడంతో సభలో చర్చ తీవ్రస్థాయిలో చేరింది. కొడాలి నాని జోక్యం చేసుకొని.. తమతో తిట్టించుకోవద్దని చంద్రబాబుపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందిస్తూ..
కొడాలి నాని ఆగ్రహం
సాక్షి పేపర్ను ఎవరూ నమ్మరని చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంపై మంత్రి కోడాలి ఘాటుగా స్పందించారు. సాక్షి పేపర్పై తప్పుగా మాట్లాడుతున్నారు. హెరిటేజ్ ద్వారా రైతల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముకునే వ్యక్తి చంద్రబాబు అని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు 71 ఏళ్లు. తన కొడుకు వయసు ఉన్న వ్యక్తి సీఎం అయితే సలహాలు ఇవ్వకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నాడని కొడాలి నాని అన్నారు.
150 మంది దాడి చేసినా..
తన వయసు గురించి వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. నేను ఒక్కడిని మాట్లాడితే పదుల సంఖ్యలో మంత్రులు నాపై మాటల దాడి చేస్తున్నారు. 150 మంది మాట్లాడినా అందరికి సమాధానం చెబుతాను. తన వయసు 70 ఏళ్లు అయినా తాను 25 ఏళ్ల యువకుడిలా ఆలోచిస్తాను. ప్రొగ్రెసివ్ ఐడియాస్ ఉంటాయి. రాష్ట్రాన్ని రైట్ ట్రాక్లో పెడుతా. నా నిజాయితీని నిరూపించుకొంటాను అని చంద్రబాబు అన్నారు.
నీ మైండ్ గేమ్స్ నా వద్ద చెల్లవు
నీ మైండ్ గేమ్స్ నా వద్ద చెల్లవు. సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడటం ఎక్స్పర్ట్. నా వద్ద సీఎం మైండ్ గేమ్ చెల్లదు. నేను అధికారంలోకి వస్తే వర్షాలు పడవని విమర్శిస్తారు. వరుణుడిని సీఎం జైలుకు తీసుకుపోతాడనే భయంతో వర్షాలు పడుతున్నాయి అని చంద్రబాబు ఘాటుగా స్పందించాడు. మీ మైండ్ గేమ్ ఆటలు నా వద్ద సాగవు అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరుణుడిని కూడా జైలుకు..
వరుణుడిని జైలుకు తీసుకుపోతాడని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ్యుల మధ్య గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. సభలో ఇలాంటి సంఘటనలు చాలా చూశాను. సభలో మర్యాద లేకుండా సభ్యులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు అని అన్నారు.