హైదరాబాద్ టూ కాల్వగట్ట: చంద్రబాబు పై కొడాలి నాని సెటైర్లు.. అదో పెద్ద జాబితా..వాడీ వేడీగా..!
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజునుంచి హాట్ హోట్గా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పింఛన్లపై జరిగిన చర్చ సందర్భంగా సభలో రచ్చ జరిగింది. మీరెంత ఇచ్చారంటే మీరెంత ఇచ్చారు అని అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. అర్హులైన వారందరికీ ఒకటో తారీఖు రాగానే ఠంచనుగా పింఛన్ ఇస్తున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వమని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇస్తున్న దానికంటే ఎక్కువగానే ప్రస్తుత ప్రభుత్వం ఇస్తోందని చెప్పారు. సభలో మంత్రి వివరణ ఇస్తున్న క్రమంలో "పారిపోవడం" అనే పదం సభలో గందరగోళంకు దారితీసింది.
చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు
నాలుగవ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక పింఛన్పై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే మంత్రి కొడాలి నాని సభకు వివరించారు. వివరిస్తున్న సమయంలో చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రతిసారీ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలకు అందజేయాలని భావిస్తున్న ప్రతి సంక్షేమ పథకంపై దుష్ప్రచారం చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. సభ నుంచి బయటకు వెళ్లగానే ప్రెస్ మీట్ పెట్టి ఫలానా ప్రశ్న అడిగితే జగన్ ప్రభుత్వం పారిపోతోందంటూ చెప్పి ప్రజలకు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ను వీడి టీడీపీకి అప్పుడే పారిపోయారు
అసలు పారిపోయిందెవరో పారిపోతున్నదెవరో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు మంత్రి కొడాలి నాని. పారిపోవడం అనేది వైయస్ కుటుంబంకు తెలియదని చెప్పిన కొడాలి నాని... చంద్రబాబు ఎన్నిసార్లు పారిపోయారో ఒక జాబితా సిద్దం చేసుకుని సభకు వచ్చినట్లు చెప్పారు. సభ ద్వారా ప్రజలకు తెలియాలనే తాను చంద్రబాబు హిస్టరీ రాసుకొచ్చినట్లు కొడాలి నాని వెల్లడించారు. ముందుగా 1983లో కాంగ్రెస్ను వీడి తెలుగుదేశంకు చంద్రబాబు పారిపోయి వచ్చారని చెప్పారు. ఆ తర్వాత చంద్రగిరిని వీడి కుప్పంలో వాలారని ఎద్దేవ చేసిన కొడాలి నాని. ఆ తర్వాత ఓటుకు నోట్లు కేసులో హైదరాబాదు నుంచి పారిపోయి కాల్వ కట్టపై వాలారని అనంతరం కరోనావైరస్ రావడంతో కాల్వకట్టను వీడి హైదరాబాదులోని అద్దాల మేడలోకి పారిపోయారని చెప్పారు. కొడాలి నాని మాటలు సభలో నవ్వులు పూయించాయి.
చీకట్లో చిదంబరం కాళ్లు... మోడీకి తెలియని తెలుగులో
చంద్రబాబు మెప్పు కోసం మిగితా టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నారని... దానివల్ల ఎలాంటి లాభం ఉండదని కొడాలి నాని అన్నారు. ఇక పారిపోవడంలో చంద్రబాబు ఫస్ట్ అని చెప్పిన కొడాలి నాని... చీకట్లో ఢిల్లీకి వెళ్లి చిదంబరం కాళ్లపై పడ్డారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం నల్ల దుస్తులు ధరించి ఏదేదో మాట్లాడారని మోడీపై విమర్శలు చేశారని చెప్పిన మంత్రి... ఎలాగూ వారికి తెలుగు అర్థం కాదు కాబట్టి అక్కడ నాలుగు మాటలు తెలుగులో మాట్లాడి పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక పొత్తు లేకుండా సొంతంగా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ గెలవలేదనే విషయాన్ని గుర్తుచేశారు కొడాలి నాని. చంద్రబాబుకు అందితే తల లేదంటే కాళ్లు పట్టుకునే రకమని.. అది కూడా కాకుంటే వెన్నుపోటు పొడవడం తెలుసని కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కొడాలి నాని చెబుతున్న సమయంలో ఒక్కసారిగా సభలో హీట్ పెరిగింది. టీడీపీ సభ్యులు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టడంతో సభలో గందరగోళం ప్రారంభమైంది.