అసెంబ్లీ కమిటీలు ఏర్పాటు: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా కాకాని: రూల్స్ కమిటీలో వంశీ ..!
ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారాం శానసభా కమిటీలను ప్రకటించారు. కొత్త ప్రభుత్వంలో కొత్త సభ్యులతో సభ ఏర్పడిన తరువాత ఈ కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిబంధనల కమిటీ.. పిటీషన్ల కమిటీ..ప్రివిలేజ్ కమిటీ..కీలకమైన ఎథిక్స్ కమిటీ..ప్రభుత్వ హామీల అమలు పైన కమిటీలను ఏర్పాటు చేసారు. అయితే, నిబంధనల కమిటీ చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని వ్యవహరిస్తారు. అదే విధంగా ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గెర్దన్ రెడ్డకి అప్పగించారు. ఇక, ఎథిక్స్ కమిటీ చైర్మన్ బాధ్యతలు సీనియర్ నేత అంబటి రాంబాబుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా రాజకీయంగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన వల్లభనేని వంశీకి రూల్స్ కమటీలో స్థానం కల్పించారు. అయితే, రెండో సారి టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన సీనీ హీరో బాలక్రిష్టకు మాత్రం అవకాశం దక్కలేదు. స్పీకర్ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తూ తాజాగా బులెటిన్ విడుదల చేసారు.
వెంకయ్య నాయుడు అలా చేసి ఉండకూడదు : స్పికర్ తమ్మినేని సీతారాం
స్పీకర్ ఛైర్మన్ గా రూల్స్ కమిటీ..
అసెంబ్లీ నిబంధనల కమిటీ చైర్మన్ గా స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహరిస్తారు. అందులో సభ్యులుగా వైసీపీ నుండి సీనియర్ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించిన చిన అప్పలనాయుడు.. ధర్మాన ప్రసాదరావు..మానుగుంట మహీధర్ రెడ్డి..అప్పలనాయుడు తో పాటుగా టీడీపీ నుండి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అవకాశం కల్పించారు. గత నెల 25న ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తరువాత వంశీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన టీడీపీ వీడి వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే, ఇప్పటికీ ఆయన స్పష్టత ఇవ్వటం లేదు. ఇక, పిటీషన్ల కమిటీ ఛైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వ్యవహరిస్తారు. సభ్యులుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. వసంత క్రిష్ణ ప్రసాద్..కాసు మహేష్ రెడ్డి..ముదునూరి ప్రసాదరాజు..ఆళ్ల రామక్రిష్ణారెడ్డి.. టీడీపీ నుండి ఏలూరి సాంబశివ రావు సభ్యులుగా ఉంటారు.
ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ గా గోవర్ధన్ రెడ్డి..
ఇక కీలకమైన ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ బాధ్యతలను నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డికి అప్పగించారు. సభ్యులుగా మల్లాది విష్ణు..వెంకట రమణ మూర్తి రాజు..వెంకట చిన అప్పల నాయుడు.. వి వరప్రసాద రావు.. శిల్పా చక్రపాణి రెడ్డితో పాటుగా టీడీపీ నుండి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు అవకాశం కల్పించారు. ప్రభుత్వ హామీల కమిటీ ఛైర్మన్ గా కొట్టు సత్యనారాయణ.. సభ్యులుగా.. సర్వత పూర్ణ చంద్రప్రసాద్..కొఠారి అబ్బయ్య చౌదరి..మేడా మల్లిఖార్జున రెడ్డి...కె నాగార్జున రెడ్డి.. అబ్దుల్ హఫీజ్.. టీడీపీ నుండి నాయుడకి అవకాశం దక్కింది. అయితే, ఏ కమిటీలోనూ టీడీపీ నుండి బాలక్రిష్ణ పేరు..అదే విధంగా జనసేన నుండి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్న రాపాక వర ప్రసాద్ కు అవకాశం ఇచ్చినట్లుగా లేదు.
ఎథిక్స్ కమిటీ బాధ్యతలు అంబటికి..
సభలో సభ్యుల వ్యవహార శైలి మీద నిర్ణయాలు తీసుకొనే కీలకమైన ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలు పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు అప్పగించారు. అందులో సభ్యులుగా.. చెన్నకేశవ రెడ్డి.. జగన్మోహన రావు.. శెట్టిపల్లి రఘురామిరెడ్డి.. అనంత వెంకట్రామిరెడ్డి.. మేకా వెంకట ప్రతాప అప్పారావు తో పాటుగా.. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరిని నియమించారు. ఈ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది.