సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ- అధికారులకు స్పీకర్, మండలి ఛైర్మన్ కీలక సూచనలు..
ఈ నెల 30 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగబోతున్నాయి. సమావేశాల సందర్భంగా తీసుకోవాల్సిన కోవిడ్ చర్యలతోపాటు ఇతర భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ షరీఫ్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. గత సమావేశాల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, శాసన సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గుర్తించి, వారితో గౌరవప్రదంగా మెలగాలని పోలీసు అధికారులకు సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లో ఓపికతో విధులు నిర్వర్తించాలన్నారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. శాసన సభ సమావేశాల భద్రతపై ఇప్పటికే పలు సమావేశాలు నిర్వహించినట్లు ఇంటెలిజెన్స్ ఓఎస్డీ శశిధర్ తెలిపారు. సీఎం, ఇతర ముఖ్యుల కాన్వాయ్ ల రిహార్షల్స్ కూడా నిర్వహించామన్నారు. ముఖ్యంగా కొవిడ్ ను దృష్టిలో పెట్టుకుని... కరోనా పరీక్షలు నిర్వహించి నెగిటివ్ రిపోర్టు వచ్చిన తరవాతే ప్రజాప్రతినిధుల భద్రతా సిబ్బంది, ఇతర పోలీసు సిబ్బందికి అనుమతిస్తున్నామన్నారు.
శాసన సభ సమావేశాల్లో అడిగే ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడం సభ్యుల ప్రాథమిక హక్కు అని శాసనమండలి చైర్మన్ ఎం.ఎ.షరీఫ్ స్పష్టం చేశారు. శాఖల వారీగా సభ్యుల అడిగే ప్రశ్నలకు తప్పనిసరిగా జవాబులు అందించాల్సిన బాధ్యత ఆయా శాఖాధిపతులపై ఉందన్నారు. శాసనసభ సమావేశాలు ఫలప్రదం చేయాల్సిన బాధ్యత ఎక్కువగా అధికారులపై ఉందన్నారు. సమావేశాల్లో జీరో అవర్ ఎంతో ముఖ్యమైన అంశమన్నారు. తమ నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై జీరో అవర్ లో ప్రశ్నల రూపంలో సభ దృష్టికి సభ్యులు తీసుకొస్తారన్నారు. వాటికి సమాధానాలు తెలుసుకోవడం వారి ప్రాథమిక హక్కు అని ఆయన స్పష్టం చేశారు. ఆయా శాఖలు విధిగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అందజేయాలన్నారు.
శాసన సభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయని, ఆరోజే బిల్లులన్నీ సిద్ధం చేయాలని ఆయా శాఖాధిపతులకు అసెంబ్లీ స్సీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. కొవిడ్ దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమావేశాలను పకడ్బంధీగా నిర్వహించాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను టీవీల్లో ప్రజలు గమనిస్తుంటారని, దీన్ని గుర్తిస్తూ సభ్యులడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. తామడిగిన ప్రశ్నకు సమాధానం లభించినప్పుడే సభ్యులు సంతృప్తి చెందుతారన్నారు. తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో ప్రస్తావిస్తారనే ఆసక్తి ప్రజల్లో ఉంటుందన్నారు. ఇటువంటి సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు, పరిష్కారాలు లభిస్తే ప్రజలు కూడా సంతృప్తి చెందుతారన్నారు. ఇకపై ప్రతి సెషన్ ముందు గత సెషన్ కు సంబంధించిన ప్రశ్నలు, ఇచ్చిన జవాబులు, ఇవ్వాల్సిన జవాబులపై డిపార్టుమెంట్ల వారీగా సమీక్షలు నిర్వహించడం వల్ల ఎంతో మేలు చేకూరే అవకాశముందన్నారు.