కేంద్రం చేతికి పోలవరం!? జగన్ కు కాదు..ఆ ఇమేజ్ మనకే దక్కాలి: బీజేపీ కొత్త ఎత్తుగడ..!
Recommended Video
ఏపీలో రాజకీయంగా బలోపేతం అవ్వాలని భావిస్తున్న బీజేపీ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగా ఏపీకి కీలకమైన పోలవరం మీద బీజేపీ నేతలు కొత్త ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన కేంద్రం..నిధులు మాత్రం రీయంబర్స్ చేస్తోంది. అయితే, ఇప్పుడు ఏపీలో రాజకీయంగా ప్రజల్లో ఇమేజ్ పెరగాలంటే కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరువాత నిధులు ఇస్తూ..ఆ క్రెడిట్ ఏపీ ప్రభుత్వానికే దక్కుతోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. దీంతో..ఆ ప్రాజెక్టు బాధ్యతలను కేంద్రమే తీసుకుంటే తమకు కలిసి వస్తుందనే ఆలోచన మొదలైంది. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ ఇదే పోలవరం కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేసారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రం పోలవరం రాష్ట్రమే పూర్తి చేస్తుందని తేల్చి చెప్పారు. దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలను గమనించిన బీజేపీ ఇప్పుడు కొత్త నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది. దీని వెనుక లాభ నష్టాలను అంచనా వేస్తోంది.
పోలవరం రివర్స్ టెండరింగ్తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...
కేంద్రం పైన బీజేపీ నేతల ఒత్తిడి..
ఏపీలో పార్టీ ఎదగాలంటే..రాష్ట్రం కోసం కేంద్రం ఏ రకంగా అండగా నిలిచిందీ చెప్పుకోవటంలో ఇప్పటి వరకు విఫలమయ్యామనే భావనలో బీజేపీ నేతలున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాము చేసిన సాయం గురించి ఎక్కడా చెప్పకుండా..చివరకు బీజేపీ మోసం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యారు. ఫలతంగా ఏపీ ప్రజల్లో బీజేపీ దోషిగా నిలబడింది. తిరిగి ఇప్పుడు కూడా అదే మరసారి జరగకుండా..కేంద్రం నిధులతో ఏపీలో అమలు చేస్తున్న ప్రాజెక్టులను కేంద్రమే స్వయంగా నిర్వహించాలనే ఆలోచన ఏపీ బీజేపీ నేతల్లో మొదలైంది. దీని ఫలితంగానే ఇప్పుడు బీజేపీ నేత లు కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నారు. అందులో ఇప్పుడు పోలవరం పైన నేతలు ఫోకస్ చేస్తున్నారు.
జగన్ గతంలో కోరారు..ముఖ్యమంత్రి అయ్యాక..
పోలవరంలో గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలతో పాటుగా స్వయంగా ప్రధాని సైతం ఆరోపించారు. ప్రాజెక్టు టీడీపీకీ ఏటీయం కార్డుగా మారిందని విమర్శించారు. ఇక, ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పోలవరం లో అవినీతి కోసమే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వీకరించారాని..కేంద్రమే ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్ చేసారు. అదే జగన్, సీఎం అయిన వెంటనే ఢిల్లీ వెళ్లిన సమయంలో పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేస్తుందని స్పష్టం చేసారు. ఇక, తాజాగా రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రాజెక్టులో ఇప్పటి వరకు రూ. 800 కోట్లకు పైగా ప్రజాధనం ఆదా చేయగలిగామని చెప్పుకొచ్చారు. మేఘా సంస్థకు ప్రాజెక్టు పనులు అప్పగించేందుకు రంగం సిద్దమైంది.
పార్టీ నేతలు కోరినా..కేంద్రానికి ఇబ్బందే
ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం మీద ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. అందులో భాగంగా రైతు భరోసా పధకం.. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తున్నా రాజకీయంగా మాత్రం ప్రయోజనం దక్కటం లేదని వాదిస్తున్నారు. దీంతో..ఏపీ బీజేపీ నేతలు కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి కేంద్రమే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను స్వీకరించాలని కోరనున్నారు. అయితే, గతంలో చంద్రబాబు ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యత లను అప్పగించి..ఇప్పుడు జగన్ ప్రభుత్వానికి నో చెబితే అది ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే అంచనాలు వేస్తున్నారు. అయితే, పోలవరం పునరావాస ప్యాకేజీ పైన కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. ఇక, రాష్ట్రంలో ప్రాజెక్టు ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అయినా ఇప్పుడు కేంద్రం చేపడితే...ప్రాజెక్టు పైన మొత్తానికి ప్రతికూల ప్రభావం పడుతుందనే వాదన వినిపిస్తోంది.
ప్రధానితో భేటీ సమయంలో జగన్ ఇలా..
తాను ముఖ్యమంత్రి అయిన తరువాత అమలు చేస్తున్న రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా పోలవరం నిర్మాణ ఖర్చు తగ్గిందని జగన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. నవంబర్ 1 నుండి తిరిగి ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నామని..న్యాయ పరమైన చిక్కులు క్లియర్ అవ్వగానే పనులు ప్రారంభిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రధాని సైతం పోలవరం తో సహా అన్ని విషయాల్లోనూ కేంద్రం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో పార్టీ పరంగా మాత్రం కేంద్ర ప్రభుత్వం మీద ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనే ఒత్తిడి మొదలైంది. దీనికి బీజేపీ అధినాయకత్వం ఏ మేరకు సానుకూలంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.