కన్నాపై సోము వీర్రాజు అనూహ్య వ్యాఖ్యలు - సీఎం జగన్ కు సీరియస్ వార్నింగ్ - సంచైత ట్వీట్ హైలైట్
''కమల వనంలోకి టీడీపీ మిడతల దండు.. ఆ పచ్చ దండులో కన్నా కూడా ఉన్నారా?''అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు.. ''బీజేపీలో ఉంటూ టీడీపీ వాణిని వినిపిస్తున్నారు''అని కాషాయ దళానికే చెందిన ఇంకొరు నేతల ఆరోపణలు.. రాజధాని బిల్లులపై గవర్నర్ కు రాసిన లేఖలతో హైకమాండ్ ఆగ్రహావేశాలు.. వెరసి విపరీతమైన వ్యతిరేకత ఏర్పడినందునే కన్నా లక్ష్మీనారాయణను ఏపీ బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించారనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై పార్టీ నూతన సారధి సోము వీర్రాజు స్పందించారు.
కన్నాపై ఆ ప్రచారం..
తనకు ఏపీ బీజేపీ చీఫ్ గా ప్రమోషన్ లభించినప్పటి నుంచి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై కొనసాగుతోన్న ప్రచారాలను సోము వీర్రాజు ఖండించారు. కన్నాను కావాలనే అధ్యక్ష పదవి నుంచి తప్పించి, తనను నియమించారనే వాదనలో ఎలాంటి నిజం లేదని చెప్పారు. భారతీయ జనతా పార్టీలో వ్యక్తులకు ఏనాడూ ప్రధాన్యం ఉండదని, ప్రతి ఒక్కరికీ పార్టీ, సిద్ధాంతాలే ముఖ్యమవుతాయని అన్నారు. మంగళవారం పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ ఆయనీ కామెంట్లు చేశారు.
ఏపీ బీజేపీలో భారీ మార్పు: కన్నా ఔట్ - కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకం - కారణం ఇదేనా?
సీఎంకు సోము వార్నింగ్
కన్నా ఇన్నాళ్లూ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించగా, కొత్త చీఫ్ సోము.. వైసీపీ పట్ల సాఫ్ట్ కార్నర్ కలిగిన వ్యక్తి అంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చకు వీర్రాజు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ఏపీ బీజేపీ చీఫ్ గా నియమితులైన మరుసటి రోజే సీఎం వైఎస్ జగన్ కు వీర్రాజు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ సర్కారు అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని అన్నారు. తాజాగా చేపట్టిన ఇంటి స్థలాల కార్యక్రమంలో అనేక లొలుసుగులున్నాయని, వాటిపై విచారణ జరిపించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. టీటీడీ స్థలాలతోపాటు ప్రభుత్వ భూములను అమ్మడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. వైసీపీపై పోరులో రాజీపడబోమన్నారు.
నిత్య పెళ్లి కూతురు స్వప్న.. కేంద్రమంత్రి నిర్మల పేరునూ వాడేసుకుంది.. నాలుగో భర్తపై కేసు పెట్టబోయి..
మోదీ, పవన్ కు థ్యాంక్స్..
తనను ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ గా నియమించినందుకుగానూ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ తోపాటు కేంద్ర నాయకత్వంలోని అందరికీ సోము వీర్రాజు ధన్యవాదాలు తెలిపారు. తనను అభినందించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు కూడా వీర్రాజు థ్యాంక్స్ చెప్పారు. ‘‘రాజకీయంగా ఎంతో అనుభవం, పుష్కలమైన నాయకత్వ లక్షణాలు, సేవా తత్పరత కలిగిన వీర్రాజు నాయకత్వంలో బీజేపీ ఏపీలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను''అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
తన లక్ష్యమేంటో చెప్పేసిన సోము..
కీలక సమయంలో ‘‘నాపై పెట్టిన ఈ బాధ్యతను నేను మనసా, వాచా, కర్మణ నిబద్ధతతో నిర్వహిస్తానని పార్టీని జిల్లా, మండల, గ్రామ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలోపేతం చేస్తానని, అందరిని కలుపుకుంటూ పార్టీని ముందుకు తీసుకు వెళ్లడానికి నూరు శాతం కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు''అని వీర్రాజు ప్రకటన చేశారు.
దేవధర్, సంచైత ఆసక్తికర ట్వీట్లు..
ఏపీ బీజేపీ చీఫ్ గా సోము వీర్రాజు నియామకంపై హర్షం వ్యక్తం చేస్తూనే, కన్నా సేవలను కూడా గుర్తు చేశారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవధర్. ‘‘కన్నాజీ.. ఇన్నాళ్లూ మీ నాయకత్వంలో, అకుంఠిత శ్రమతో పార్టీని రాష్ట్రం నలుమూలలకూ విస్తరించగలిగాం. ఇప్పుడు వీర్రాజు సారధ్యంలో మనందరం కలిసి పనిచేయబోతున్నాం. జనసేన కూడా మన వెంటే ఉంటుంది''అని దేవధర్ పేర్కొన్నారు. మరోవైపు, మన్సాన్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ సంచైత గజపతి రాజు సైతం సోమును అభినందిస్తూ ట్వీట్ చేశారు. సంచైత త్వరలోనే వైసీపీలో చేరతారనే ప్రచారానికి తెరదించుతూ, ‘‘వీర్రాజుగారూ.. మన పార్టీ మరింత బలపడేలా సింహాద్రి అప్పన్న ఆశీస్సులు మీకు తోడుంటాయి''అని సంచైత పేర్కొనడం గమనార్హం.