చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు: పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడాలని పిలుపు
విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజుకు చిరంజీవి అభినందనలు తెలిపారు.
సోమును పూలమాల, శాలువాతో సత్కరించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ, జనసేన భాగస్వామ్యం కావాలని చిరంజీవి కోరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి సోము వీర్రాజు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు.
ఏపీలో బీజేపీ, జనసేన కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఏపీలో జరిగే 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే పలు కార్యక్రమాలు ఉమ్మడికి చేపడుతున్నాయి. సోము వీర్రాజుకు ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.
కాగా, రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్ఎస్ఎస్) నేపథ్యం ఉన్న సోము వీర్రాజును బీజేపీ అధిష్టానం కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో ఏపీ అధ్యక్షుడిగా ఇటీవలే నియమించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తానని, పార్టీని బలోపేతం చేస్తానని సోము చెప్పారు. పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోము వీర్రాజు పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని కలిశారు.