రేపు మరోసారి రామతీర్ధానికి సోము వీర్రాజు-త్వరలో రాష్ట్ర పర్యటనకు ఏర్పాట్లు
ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఆలయాలు, విగ్రహాల విధ్వంసంపై మండిపడుతున్న బీజేపీ నేతలు ఈసారి మరో భారీ స్కెచ్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రామతీర్ధంలో విగ్రహం ధ్వంసమైన నేపథ్యంలో పోలీసులు బీజేపీ నేతలను వెళ్లకుండా అడ్డుకోవడంతో వారు ఇప్పుడు ఇతర ఆలయాలకూ వెళ్లడం ద్వారా సత్తా చాటుకోవాలని భావిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ ప్రకటించారు.
రాష్ట్రంలో వరుస పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా టోన్ మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ సైలెంట్గా ఉంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న ఆయన ఇవాళ మాట్లాడుతూ... రాష్ట్రంలో మెజారిటీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని, మిగిలిన పార్టీల్లా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోమన్నారు. తాము మౌనంగా ఉంటామని ప్రభుత్వం భావిస్తోందని, కానీ అది జరిగే పని కాదన్నారు.
రాష్ట్రంలో చర్చిలు, దర్గాలు కట్టిస్తామంటున్న వైసీపీ మతతత్వవాద పార్టీ కాదు కానీ, హిందువుల గురించి మాట్లాడితే తాము మతతత్వ వాదులమా అని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రేపు రామతీర్ధానికి వెళ్తున్నామని, ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేయాలని సోము డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ నేతలకు ఇచ్చినట్లే అన్ని ప్రోటోకాల్ మర్యాదలూ కల్పించాలని కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవతా విగ్రహాలకు ఇవ్వలేదని సోము మండిపడ్డారు. శ్రీశైలం ఆలయాన్ని ఇప్పటికీ అన్యమతస్థులు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు.