రాజధానిపై గందరగోళం: ఓవీ రమణపై వేటు వేసిన బీజేపీ
విజయవాడ: బీజేపీ నేత, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు డాక్టర్ ఓవీ రమణపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందంటూ ఆయన వ్యాసం రాసిన క్రమంలో ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం వేటు వేసింది.
ఈ మేరకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు బుధవారం నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. రమణ తీరును రాష్ట్ర బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పారు.
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడినందుకు ఓవీ రమణను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. మూడు ముక్కలాటతో నష్టపోతున్న బీజేపీ అంటూ ఓవీ రమణ.. రెండ్రోజుల క్రితం ఓ తెలుగు దినపత్రికలో వ్యాసం రాశారు.
ఓవీ రమణ తన వ్యాసంలో బీజేపీ నేతలను ఇరుకునపెట్టే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఒకసారి ఆయన రాసిన వ్యాసంలో కొన్ని వ్యాఖ్యలను గమనిస్తే.. మొన్నటి దాకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని దీక్షలు చేశారు. మీడియా సమావేశాలు పెట్టి ఒకటికి పదిసార్లు ప్రకటించారు.
ఇక ఇప్పుడేమో రాజధాని కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదని, పార్టీవేరు కేంద్ర ప్రభుత్వం వేరని అంటున్నారు. దీంతో బీజేపీపై ప్రజల్లో ఉన్న నమ్మకం ఒక్కసారిగా పడిపోయింది. నిన్న ఏపీ నూతన అధ్యక్షుడు ఢిల్లీలో మాట్లాడుతూ.. 'అమరావతి రైతులకు అండగా ఉంటాం. రాజధాని విషయం మాత్రం రాష్ట్రం నిర్ణయమే' అని చెప్పడం విచిత్రంగా ఉంది. రైతులు పోరాటం చేస్తున్నదే రాజధాని కోసం అయినప్పుడు ఇక మద్దతు దేనికిస్తున్నట్లు? ఈ గందరగోళం వల్ల విలువలతో కూడుకున్న బీజేపీ ఔన్నత్యాన్ని శంకించే పరిస్థితి ఏర్పడింది అంటూ ఓవీ రమణ పేర్కొన్నారు. అయితే, పార్టీలో చర్చించకుండా ఇలా బహిరంగంా అభిప్రాయాలను వ్యక్తం చేయడంపై రాష్ట్ర బీజేపీ తీవ్రంగా పరిగణించి ఈ మేరకు వేటు వేసినట్లు తెలుస్తోంది.