బీజేపీలో టీడీపీ బ్రాండ్ లీడర్పై సస్పెన్షన్ వేటు: లైన్లో మరికొందరు: భారీ ప్రక్షాళన దిశగా
అమరావతి: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు దూకుడు మీదున్నారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గళం విప్పే నేతలపై వేటు వేయడానికి వెనుకాడట్లేదు. ఇదివరకు షోకాజ్ నోటీసులను జారీ చేసిన నేతలపై సస్పెన్షన్ వేటుకు తెర తీశారు. బీజేపీలో తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తోన్న నేతలపై తొలి వేటు పడుతోంది. అలాగే- మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్న వారిపై కత్తి నూరుతోంది బీజేపీ. ప్రక్షాళన తప్పకపోవచ్చనే సంకేతాలను పంపిస్తోంది.
బిగ్బాస్లో సరికొత్త ప్రయోగం: ఎలిమినేషన్కు బదులుగా ఇన్విజిబుల్: ఏమిటది?
లంకా దినకర్పై వేటు..
తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన లంకా దినకర్పై వేటు పడింది. బీజేపీ ప్రక్షాళనను ఆయనతోనే ప్రారంభించినట్లు స్పష్టమౌతోంది. మీడియా డిబేట్లలో పాల్గొంటూ అమరావతికి అనుకూలంగా మాట్లాడటంపై లంకా దినకర్కు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఆగస్టులో షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అందులో పొందుపరిచిన అంశాలకు సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. ఆ తరువాత లంకా దినకర్ నుంచి సమాధానం అందినప్పటికీ.. అది సంతృప్తికరంగా లేదని భావించారు. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
లైన్లో మరికొందరు నేతలు..
ఈ సస్పెన్షన్ల వ్యవహారం లంకా దినకర్తో ఆగేలా కనిపించట్లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, అమరావతికి అనుకూలంగా ఎవరు మాట్లాడినా..వారిపై వేటు వేయడానికి సిద్ధమౌతోంది బీజేపీ. కొద్దిరోజుల కిందటే పార్టీ నాయకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండి మాజీ సభ్యుడు ఓవీ రమణను సస్పెండ్ చేసింది. మరో నాయకుడు వెలగపూడి గోపాలకృష్ణపైనా వేటు వేసింది. వారితోపాటు తెలుగుదేశం పార్టీని సమర్థించేలా, ఆ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి గళాన్ని వినిపించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదనే సంకేతాన్ని పంపించింది.
సోము వీర్రాజు రాకతో..
కన్నా లక్ష్మీనారాయణ పదవీ కాలం ముగిసిన తరువాత.. ఆయన స్థానంలో పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు పగ్గాలు అందుకోవడంతో బీజేపీలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదివరకు నియమించిన రాష్ట్ర కమిటీల్లోనూ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు మాజీమంత్రులు ఆదినారాయణ రెడ్డి, రావెల కిశోర్బాబుకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పోస్టులను ఇచ్చారు. వారిని పార్టీ రాష్ట్రశాఖ ఉపాధ్యక్షులుగా నియమించారు. పార్టీ సిద్దాంతాలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉండే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
సోము ముద్ర.. స్పష్టంగా
ఇదివరకు బీజేపీ రాష్ట్రశాఖకు నాయకత్వాన్ని వహించిన కన్నా లక్ష్మీనారాయణ హయాంలో క్రమం తప్పకుండా అమరావతికి అనుకూలంగా ప్రకటనలు చేస్తూ వచ్చారు కొందరు పార్టీ నేతలు. కన్నా లక్ష్మీనారాయణే స్వయంగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రదర్శనలను నిర్వహించారు. ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో దీక్షకూ కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. మూడు రాజధానుల అంశం రాష్ట్రం పరిధిలోనిదేనంటూ బీజేపీ పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చినప్పటికీ.. దాన్ని ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ పరిస్థితులను మార్చేస్తున్నారు సోము వీర్రాజు. పార్టీపై తన ముద్ర ఉండేలా జాగ్రత్తలను తీసుకుంటున్నారు.