వినూత్నంగా ఏపి బడ్జెట్ సమావేశాలు..! అందరికి అవకాశం ఇస్తామన్న ఏపి స్పీకర్..!!
అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం ముగిసింది. స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి జగన్, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 పని దినాలపాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెలవులతో కలిపి ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. శాసనసభ సమావేశాలు 11 తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. అనంతరం 12వ తేదీన 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయబడ్జెట్ను సభ ముందుంచనున్నారు. ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజు బీఏసీ సమావేశం నిర్వహిస్తున్నారు. కానీ ఈసారి.. సంప్రదాయానికి భిన్నంగా ఒకరోజు ముందే నిర్వహించారు.
జగన్ మార్క్ షాక్ ట్రీట్మెంట్ : డబ్బు తీసుకున్న వైసీపీ ఎమ్మెల్యే: సీఎం నిర్ణయంతో షేక్..!
12న బడ్జెట్..! 30 వరకు అసెంబ్లీ సమావేశాలన్న స్పీకర్..!!
అసెంబ్లీ సమావేశాలను గరిష్ఠంగా ఏడాదికి 105 రోజులపాటు నిర్వహించారు. ఆ రికార్డును అధిగమించటానికి ప్రయత్నిస్తామని శాసనసభాపతి తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఈ మధ్యకాలంలో 50-55 రోజుల్లోపే సమావేశాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని, ఈ సంఖ్య క్రమంగా పెంచుకుంటూ పోవాలని చూస్తున్నామని చెప్పారు. గురువారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వన్ ఇండియా ప్రత్యేక కథనం.. ప్రతిరోజూ ప్రశ్నోత్తరాల సమయం కొనసాగిస్తాం. ఈ ప్రశ్నలకు, అలాగే శూన్యగంటలో సభ్యులు లేవనెత్తే అంశాలకు సంబంధిత శాఖల నుంచి సమాధానాలను ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపే అందించాలని నిర్ణయించాం. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖాధిపతులు, కార్యదర్శులకు సూచించాం.
పద్ధతి ప్రకారం సభ నిర్వహణ..! సమయాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని సూచన..!!
ఈసారి కొత్త సభ్యులు అధికంగా ఉన్నారు. వారికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తూనే, అంశాలవారీగా సీనియర్లకు కూడా అవకాశమివ్వడం ద్వారా సభలో సమతుల్యత తీసుకువస్తామని స్పీకర్ తెలిపారు. సభ నిర్వహణకు కొన్ని సంప్రదాయాలు, నిబంధనలు ఉన్నాయి. వాటిని అనుసరిస్తూ ఒక పద్ధతి ప్రకారం సభ నిర్వహిస్తాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో సభ్యుల సంఖ్య ఆధారంగా సభలో ఆయా పక్షాలకు సమయాన్ని కేటాయించాల్సి ఉంది. అసంబద్ధ అంశాలపై సభాసమయాన్ని వృథా చేయడానికైతే అవకాశమివ్వలేమని స్పష్టం చేసారు సభాపతి.
అవసరమైతే సమావేశాల పొడిగింపు..! పరిమిత సంఖ్యలో సందర్శకులకు అవకాశం..!!
బడ్జెట్ సమావేశాలు నెలాఖరు వరకు జరిగే అవకాశం ఉంది. 20 రోజులు పనిదినాలుండవచ్చని సభాపతి తెలిపారు. అవసరమైతే సభా సమావేశాలను మరికొన్ని రోజులు పొడిగించేందుకు సభా నాయకుడి దృష్టికి తీసుకువెళతామని వైసీపి ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ప్రస్తుత అసెంబ్లీ ప్రాంగణం విశాలంగా లేనందువల్ల ఎక్కువ మంది సందర్శకులు వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని, అందువల్ల శాసనసభ్యులు తమ వెంట వచ్చే సందర్శకులను రోజుకు ఇద్దరికి పరిమితం చేసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ కమిషనర్, సంబంధిత అధికారులతో చర్చించాం, ఫలహారశాల ఈ నెల 15 లేదా 16నాటికి అందుబాటులోకి వస్తుంది. మిగతా నిర్మాణాలు, మౌలికవసతులను వచ్చే సమావేశాల నాటికి సిద్ధం చేస్తామని స్పకర్ తెలియజేసారు.
ఉన్నతాధికారులతో సభాపతి సమీక్ష..! ఆదర్శప్రాయాంగా వ్యవహరించాలన్న స్పీకర్..!!
అసెంబ్లీలో నామినేటెడ్ కమిటీలను ఈ బడ్జెట్ సమావేశాల్లో పూర్తి చేస్తామని సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వివిధశాఖల ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులతోనూ.. భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, అసెంబ్లీ ఇన్ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సీనియర్ ఐపీఎస్, పోలీసు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. బిల్లులను సభలో ప్రవేశపెట్టేటపుడు వాటిలో ఉండే ప్రజా ప్రయోజనాలు స్పష్టంగా ఉండేలా ప్రజలకు అర్థమయ్యేలా బిల్లులను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. 'కొత్త సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తేందుకు ఉత్సుకత చూపుతారని, మంత్రులు వారికి సమాధానం స్పష్టం చెప్పేందుకు వీలుగా కచ్చితమైన సమాచారాన్ని మంత్రులకు అందించాలి' అని ఆయన సూచించారు.