ఏపీ కేబినెట్ ఇన్సైడ్ ఇన్ఫో: సీఎం ఆవేదన ఏంటి.. జగన్ వ్యాఖ్యలతో మంత్రులు షాక్
అమరావతి: సహచర మంత్రుల ముందు ముఖ్యమంత్రి జగన్ మనసువిప్పి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో మూడు నెలల బడ్జెట్ మీద ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల మీద చర్చించారు. ఆసమయంలో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కరోనా నియంత్రణ చర్యల గురించి మంత్రులకు వివరించారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలతో మంత్రులు సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ముఖ్యమంత్రి మనోవేదన
కేబినెట్లో అధికారిక అజెండా పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ నెల 31తో ముగియనున్న ఆర్థిక సంవత్సరం చాలా ఇబ్బందికరంగా ఉందని ఇదే సమయంలో కరోనా లాక్డౌన్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మరింత ఇబ్బందికరంగా మారాయని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని 21 రోజులు లాక్డౌన్ ప్రకటించినా... అది అంతటితోనే ముగుస్తుందా లేదా అనేది చెప్పలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రం దాదాపుగా నెల రోజుల పాటు అన్నీ స్థంభించడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి మరింత కష్టంగా మారిందని జగన్ చెప్పినట్లు సమాచారం . దేశం మొత్తం లాక్డౌన్ కావడంతో కేంద్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉందని చెప్పినట్లు సమాచారం.
ఏప్రిల్ నెలలో పరిస్థితి ఎలా ఉంటుంది..?
లాక్ డౌన్ కారణంగా జీఎస్టీ, కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పినట్లు సమాచారం. ఏపీ పూర్తిగా ఆదాయాలు తెచ్చిపెట్టే శాఖలపైనే ఆధారపడి ఉందని ఇప్పుడు ఏ శాఖ పనిచేసే పరిస్థితి లేకపోవడంతో ఏప్రిల్ నెల ఏపీకి చాలా గడ్డు పరిస్థితిగా కనిపిస్తుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిమాండ్కు తగ్గట్లుగా ఉత్పత్తి జరిగి ఉండటంతో ఇబ్బంది లేకుండా జరిగిపోతుందని... మరికొంత కాలం ఉత్పత్తి ప్రారంభించకుంటే అన్ని రకాలుగా కొరత మొదలయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఉత్పాదక సంస్థలు పరిమితి సంఖ్యలో ఉద్యోగులతో పనిచేస్తామంటే వారితో చేయించడం మంచిదనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు సమాచారం.
అన్ని చెల్లింపులు నిలిపివేస్తూ ఆదేశాలు..?
వ్యవసాయపరంగా ఉత్పత్తి కొనసాగినా నిల్వలు మార్కెటింగ్ సరిగ్గా లేకపోతే రైతాంగం కూడా ఇబ్బందులు పడుతుందని ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఏపీకి కేంద్ర పన్నుల్లో వాటా.. రవాణా, మైనింగ్, ఎక్సైజ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖల నుంచే ప్రధానంగా ఆదాయం వస్తోంది. ఇప్పుడు ఇవి పూర్తిగా నిలిచిపోవడంతో ఏప్రిల్ మాసంలో ప్రభుత్వం సాధారణ ఖర్చులకు సైతం నిధుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
అంచనా వేసిన ముఖ్యమంత్రి
ఇవన్నీ అంచనా వేసిన ముఖ్యమంత్రి సహచర మంత్రులకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరూ తమ శాఖలో ఈ సమయంలో మరింత బాధ్యతగా ఉండాలని ఖర్చులు పూర్తిగా నియంత్రించుకోవాలని అదే సమయంలో కరోనా నియంత్రణ విషయంలో మాత్రం నిధులు సమస్య ఉండదని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే మరో రెండ్రోజుల్లో ఉద్యోగులకు వేతనాలు , పెన్షనర్లకు ఫించన్లు, సామాజిక పెన్షన్లు ఉండటంతో ప్రభుత్వం అన్ని రకాల చెల్లింపులను నిలిపివేస్తూ కేవలం కరోనా సంబంధిత అంశాలకు మాత్రమే మిగులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.