Vijayawada: విజయవాడలో విజయమ్మ, భారతి షాపింగ్: సింప్లిసిటీకి కేరాఫ్ అంటూ.. !
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి భారతి సోమవారం విజయవాడలో షాపింగ్ చేశారు. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను వారు సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల మండలి ఈ చేనేత వస్త్ర ప్రదర్శనను ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా శేషసాయి కళ్యాణ మండపంలో ఇది కొనసాగుతోంది. ఏపీ, తెలంగాణలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సంప్రదాయబద్ధమైన చేనేత వస్త్రాలను ఇందులో విక్రయానికి ఉంచారు.
వైఎస్ విజయమ్మ, భారతి ఈ మధ్యాహ్నం శేషసాయి కళ్యాణమండపానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా హస్తకళల మండలి ఉద్యోగులు, సిబ్బంది వారిని సాదరంగా ఆహ్వానించారు. చేనేత వస్త్రాల స్టాళ్లను తిలకించారు. ఏయే రాష్ట్రాలు, జిల్లాల నుంచి అమ్మకందారులు వచ్చారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రదర్శనలో ఏర్పాటుచేసిన వివిధ వస్త్రాలు, ఆభరణాలను పరిశీలించారు. తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేశారు.
చేనేత, కళంకారి దుస్తులను ప్రాధాన్యత గురించి వివరించారు. చేనేత దుస్తులను కొనుగోలు చేయడం, వాటికి మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం వల్ల లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధిని కల్పించినట్టవుతుందని అన్నారు. విజయమ్మ, భారతి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్న వెంటనే పలువురు మహిళలు వారిని చూడటానికి శేషసాయి కళ్యాణ మండపానికి చేరుకున్నారు. వారితో చేతులు కలుపుతూ సరదాగా గడిపారు. సుమారు గంట పాటు విజయమ్మ, భారతి అక్కడే గడిపారు.