అవినీతికి చెక్: కాల్ సెంటర్ ప్రారంభించిన సీఎం జగన్, ‘ఇడుపులపాయపై స్పెషల్ ఫోకస్’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి నిర్మూలనకు మరో ముందడుగు వేశారు. అవినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్ సెంట్ ఏర్పాటు చేశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14400 సిటిజెన్ హెల్ప్లైన్ కాల్ సెంటర్ను ఆయన ప్రారంభించారు.
సీఎం జగన్ స్పందన కోసం వెయిటింగ్: మోడీ ప్రసంగంపై పవన్ కళ్యాణ్
తొలి కాల్ ఆయనే..
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కాల్ సెంటర్కి ఫోన్ చేసి పనితీరు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14400కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఫిర్యాదు వచ్చిన 15 నుంచి నెల రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డితోపాటు మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
ఇడుపులపాయ టూరిజయం సర్క్యూట్..
ఇది ఇలావుండగా, ఇడుపులపాయ టూరిజం సర్క్యూట్పైనా సీఎం జగన్ సోమవారం సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. టూరిజం ప్రాజెక్టుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వైఎస్సార్ మెమోరియల్ గార్డెన్, గండి టెంపుల్ కాంప్లెక్స్, ఐఐటీ క్యాంపస్, ఎకో పార్క్, జంగిల్ సఫారీ, పీకాక్ బ్రీడింగ్ సెంటర్ ఎస్టిమేషన్ వివరాలను సీఎం ముందుంచారు. పులిచింతలలో వైఎస్సార్ ఉద్యానవనం ప్రణాళికను, విశాఖపట్నంలో లుంబినీ పార్క్ అభివృద్ధి గురించి సీఎంకు అధికారులు వివరించారు.
పైలట్ ప్రాజెక్టుగా పనులు..
అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. బ్యూటిఫికేషన్ పెరిగే విధంగా ఆర్కిటెక్చర్ ఉండాలని అధికారులకు సూచించారు. దీర్ఘకాలికంగా మన్నికతోపాటు ప్రాజెక్టు ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించాలని చెప్పారు. కడప, పులివెందులను మోడల్ టౌన్స్గా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించాలన్నారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన సహాయాన్ని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా) నుంచి తీసుకోవాలని సీఎం జగన్ అధికారులు తెలిపారు. పోలవరం వద్ద కూడా పార్క్ రూపొందించాలని అధికారులకు సూచించారు.