లీజులో స్వర్ణ ప్యాలెస్ హోటల్: కోవిడ్ ఆసుపత్రిగా: ప్రమాదంపై జగన్ ఆరా: వేటు పడుతుందా?
విజయవాడ: విజయవాడ గవర్నరు పేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులకు ఆదేశించారు. తక్షణ చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య చికిత్సను అందించాలని చెప్పారు.
Recommended Video
విజయవాడకు చెందిన రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కోవిడ్ సెంటర్గా మార్చినట్లు అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి వివరించినట్లు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో కరోనా వైరస్ సోకిన పేషెంట్లను పెట్టినట్టుగా ప్రాథమిక విచారణలో వెల్లడైందని సీఎంఓ అధికారులు సీఎంకు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఘటనపై లోతుగా విచారణ జరపాలని, ఘటన పూర్వాపరాలను తనకు నివేదించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ ఘటనపై ఇఫ్పటికే విజయవాడకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని ఆయన అధికార యంత్రాగాన్ని ఆదేశించారు. లీజుకు తీసుకున్న హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం అనుమతులను తీసుకుందా? లేదా? అనే విషయంపై ఆరా తీయాలని అన్నారు.
విజయవాడ: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుమంది మరణించారు. పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స కోసం వేరే ఆసుపత్రికి తరలించారు. 30 మంది కరోనా వైరస్ పేషెంట్లను ఇతర కోవిడ్ సెంటర్లో చేర్చారు. ఈ ఘటన పట్ల విజయవాడ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు.