ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్ధలు నడుచుకోవాలన్న జగన్- విజయవాడలో పతాకావిష్కరణ
విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పోరేషన్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున 74వ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం అట్టహాసంగా సాగుతోంది. నిన్నటి నుంచి నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. వర్షపు జల్లుల్లోనే సీఎం జగన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
Recommended Video
ఏపీ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జగన్, చంద్రబాబు- భావోద్వేగ ట్వీట్లు...
ఐజీఎంసీ స్టేడియంలో జరిగిన వేడుకల్లో సీఎం జగన్ తో పాటు సీఎస్ నీలం సాహ్నీ, డీజీపీ గౌతం సవాంగ్తో పాటు పలువురు బ్యూరోక్రాట్లు, మంత్రులు కూడా పాల్గొన్నారు.
జిల్లా ఇన్చార్జ్ మంత్రులు మినహా మిగిలిన మంత్రులు హాజరయ్యారు. జిల్లాల్లో మంత్రులు జాతీయ పతాకావిష్కరణల్లో పాల్గొంటున్నారు. సంక్షేమ పథకాలతో ఏర్పాటు చేసిన శకటాలతో పాటు కరోనాలో అందించిన ఆరోగ్య సేవలపై ఏర్పాటు చేసిన శకటాలు స్వాతంత్ర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముందుగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. అనంతరం ప్రసంగిస్తూ 'స్వాతంత్ర్య సమరయోధులకు పాదాభివందనం. స్వాతంత్ర్యం ప్రాణవాయువు లాంటిందని గాంధీజీ చెప్పారు. రాజ్యాంగం, చట్టప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి సాధ్యం. ప్రజాస్వామ్యం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలి' అని జగన్ అన్నారు.
సామాజిక, ఆర్ధిక భరోసాను రాజ్యాంగం కల్పించిందని, సమానత్వం పదాన్ని పుస్తకాలకే పరిమితం చేయకూడదన్నారు. రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, ఆసరా పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా పేదల జీవితాలు మార్చడానికి కృషి చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.