ఏపీ సీఎస్ పదవీకాలం మరోసారి పొడిగింపు- కేంద్రానికి జగన్ మరో లేఖ....
ఏపీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీ పదవీకాలం పొడిగింపు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే జూన్ 30న నీలం పదవీకాలం ముగియగా.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆమెను పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. దీంతో సెప్టెంబర్ 30 వరకూ నీలం పదవీకాలాన్ని పొడిగించారు. ఇప్పుడు మరోసారి మరో మూడు నెలల పాటు పొడిగింపు ఇవ్వాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీన్ని కేంద్రం పరిశీలించేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున గడువుకు ముందే జగన్ లేఖ రాశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో నీలం సాహ్నీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మరో ఐఏఎస్ కు బాధ్యతలు ఇస్తే వీటిపై అవగాహన తెచ్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. దీంతో పాటు సీఎస్ ఎంపికకు కేంద్రం ఆమోద ముద్ర కూడా అవసరం. దీంతో ప్రస్తుత సీఎస్ కే పొడిగింపు తెచ్చుకుంటే సరిపోతుందని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదీ కాక కీలకమైన రాజధాని బిల్లులతో పాటు ఇతర వ్యవహారాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటిపై ఇప్పటికిప్పుడు అవగాహన తెచ్చుకుని పరిష్కరించే సీనియర్ అధికారులు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతానికి నీలంనే ప్రత్యామ్నాయంగా జగన్ భావిస్తున్నారు.
నీలం సాహ్ని 1984 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆమె సుదీర్ఘకాలం పనిచేశారు.
నల్గొండ జాయింట్ కలెక్టర్ మచిలీపట్టణం అసిస్టెంట్ కలెక్టర్ గా నీలం సాహ్ని పనిచేశారు.
శిశుసంక్షేమ శాఖ పీడీగా , మున్సిపల్ పరిపాలనా విభాగం డిప్యూటీ సెక్రెటరీగా విధులు నిర్వహించారు.
2019 నవంబర్ 13న ఏపీ సీఎస్ గా నీలం సాహ్నిని నియమించారు.