నిమ్మగడ్డ భవిష్యత్తేమిటో?: గవర్నర్తో భేటీకి రెడీ: కాస్సేపట్లో రాజ్భవన్కు: జగన్ సర్కార్పై
విజయవాడ: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భవిష్యత్తు ఏమిటనేది కాస్సేపట్లో తేలిపోనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఆయనను ప్రభుత్వం పునర్నియమిస్తుందా? లేదా? అనేది స్పష్టం కాబోతోంది. నిమ్మగడ్డ నియామకం అంశం.. ప్రస్తుతం రాజ్భవన్కు చేరింది. ఆయన విషయంలో గవర్నర్ ఏ నిర్ణయాన్ని తీసుకుంటారనేది తేలబోతోంది. హైకోర్టు ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం తనను ఎన్నికల కమిషనర్గా పునర్నియమించడంలో ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందనే విషయంపై నిమ్మగడ్డ కొద్దిరోజులుగా న్యాయపోరాటం చేస్తున్నారు.
Recommended Video
జగన్ సర్కార్పై రాష్ట్రపతికి: అరాచక పాలన: నిమ్మగడ్డ వ్యవహారం.. కోర్టు తీర్పులు: టీడీపీ ఎంపీలు
రాజకీయ కారణాలను అడ్డుగా పెట్టుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించకుండా ఇబ్బందులకు గురి చేస్తోందనేది ఆయన ఆరోపణ. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గవర్నర్ను కలవాలంటూ హైకోర్టు ఇటీవలే నిమ్మగడ్డను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆయన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలుసుకోనున్నారు. ఈ ఉదయం 11:30 గంటలకు రాజ్భవన్కు వెళ్లనున్నారు. వినతిపత్రాన్ని ఇవ్వనున్నారు.
హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా జాప్యం చేస్తోందని, తనకు పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తోందనే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్కుమార్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. తనను ఎలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పదవి నుంచి తొలగించిందనే విషయాన్ని మొదలుకుని.. ప్రతి అంశాన్నీ గవర్నర్కు వివరించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన ఆరు పేజీల మేర వినతిపత్రాని సిద్ధం చేసుకున్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా తనను పునర్నియమించడంపై ప్రభుత్వం హైకోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ గవర్నర్కు వివరించనున్నారు. దీనిపై గవర్నర్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆయన ఆధీనంలోనే కీలక అంశాలన్నీ ఉన్నాయి. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుపై తుది నిర్ణయాన్ని తీసుకోబోయేది ఆయనే. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం కూడా రాజ్భవన్కే చేరడం ఆసక్తికరంగా మారింది.