ఏపీలో అక్టోబర్ 15 నుంచి కాలేజీలు - సెప్టెంబర్లో సెట్ల పూర్తి- జగన్ ఆదేశాలు...
ఏపీలో కరోనా కారణంగా గాడి తప్పిన ఉన్నత విద్యారంగంపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వల్ల మూతపడిన కాలేజీల పునఃప్రారంభంతో పాటు డిగ్రీ కోర్సుల్లో మార్పులు, ప్రవేశపరీక్షలు, వర్శిటీల్లో ఖాళీల భర్తీ, కాలేజీ భవనాలకూ నాడు-నేడు పథకం వర్తింపు వంటి అంశాలను సీఎం అధికారులతో సమీక్షించారు.
Recommended Video
విజయవాడ పక్కన రాజధానికి 30 వేల ఎకరాలు - జగన్ కు దేవినేని ఉమ బంపర్ ఆఫర్...
ముందుగా కరోనా కారణంగా మూతపడిన కాలేజీలను అక్టోబర్ 15న పునః ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతకు మందే సెప్టెంబర్ నెలలో అన్ని ప్రవేశపరీక్షలను పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. కాలేజీలు తెరిచిన తర్వాత విద్యాదీవెన, వసతి దీవెన ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని ఆర్థికశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపు 1110 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు స్వావలంబన దిశగా సాగాలని జగన్ సూచించారు.
డిగ్రీ కోర్సుల్లో ఎన్రోల్మెంట్ 90 శాతానికి పెంచడంతో పాటు నాలుగేళ్ల కోర్సుల్లో అప్రెంటిస్ షిప్ తో పాటు మరో ఏడాది స్కిల్ కోర్సులు నేర్చుకునేలా చూడాలని, అప్పుడు ఆనర్స్ డిగ్రీ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. విద్యావిధానంతో పాటు పాఠ్యప్రణాళికలోనూ భారీ మార్పులు చేయడం ద్వారా వాటి నాణ్యత పెంచాలన్నారు. అక్రమాలకు పాల్పడే కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్నారు. పాత మెడికల్ కాలేజీలను మరమ్మతు చేసి వాటిలో నాడు- నేడు కార్యక్రమాల కోసం రూ.6 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్లు సీఎం గుర్తు చేశారు. కాలేజీల్లో కూడా నాడు -నేడు కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ, కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో యూనివర్శిటీలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పాడేరులో ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ప్రతి ఏటా కచ్చితమైన నిధుల కేటాయింపుతో.. వచ్చే మూడు నాలుగేళ్లలో వాటి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం జగన్ సూచించారు.