అసెంబ్లీలో దిశ బిల్లు ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్- ఫాస్ట్ట్రాక్ కోర్టులకు ఓకే- పోలీసు స్టేషన్లు ఎత్తివేత
ఏపీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, వేధింపులను అరికట్టేందుకు ఉద్దేశించిన దిశ బిల్లును కేంద్రం వెనక్కి పంపిన నేపథ్యంలో వైసీపీ సర్కారు ఇవాళ మరోసారి దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గతంలో బిల్లులో పొందుపరిచిన పలు అంశాల్లో సవరణలు చేస్తూ దిశ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో దిశ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రవేశపెట్టారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు టీడీపీ డిమాండ్ చేసింది. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం అందుకు అనుమతించలేదు. టీడీపీ సభ్యులు ఎంతగా పట్టుబట్టినా స్పీకర్ మాత్రం చర్చకు ఒప్పుకోలేదు. దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ విపక్ష టీడీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నందున దీనిపై తర్వాత చర్చిద్దామని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది.
Recommended Video
మరోవైపు ఈసారి దిశ చట్టంలో ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది. ఇందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కొనసాగించాలని నిర్ణయించారు. కానీ దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లను మాత్రం ఎత్తేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వాస్తవానికి బిల్లు అమల్లోకి రాకుండానే ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించిన పోలీసు స్టేషన్లు, కోర్టులపై అప్పట్లోనే విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అన్నింటికంటే మించి గతంలో బిల్లులో ప్రతిపాదించిన 21 రోజుల్లో నిందితులకు ఉరిశిక్ష విధించాలన్న నిబందనను కూడా ప్రభుత్వం పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసు స్టేషన్లు లేక, 21 రోజుల్లో ఉరిశిక్ష లేకుండా ఈ బిల్లు కోరల్లేకుండా తయారవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.