YS Jagan Mohan Reddy: ఇంగ్లీష్ మీడియంపై విమర్శల మధ్య..తెలుగులో జీవోను విడుదల చేసిన ఏపీ సర్కార్
అమరావతి: రాష్ట్రంలో కొద్దిరోజులుగా భాషాపరమైన గొడవలు, వివాదాలు, డిబేట్లు, విమర్శలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల తెలుగు భాషా ప్రేమికులు, రాజకీయ ప్రత్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమౌతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి ఓ అడుగు వెనక్కి వేశారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకే ఇంగ్లీష్ లో విద్యను బోధిస్తామని వెల్లడించారు.
పొత్తు లేదు..ఒంటరి పోరే: అవ్వా, తాతలకు రూ.3 వేల పింఛన్ ఇస్తాం: జగన్మోహన్ రెడ్డి
ఈ గందరగోళం పరిస్థితులు, విమర్శల మధ్య ప్రభుత్వం సోమవారం తెలుగులో ఓ జీవోను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. అధికార భాషా సంఘానికి సంబంధించిన జీవో అది. యువజన వ్యవహారాలు, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఈ జీవోను విడుదల చేశారు. అధికార భాషా సంఘం సభ్యులను నియమిస్తూ ఈ జీవోను విడుదల చేశారు. ఇది కాస్త చర్చనీయాంశమైంది. సాధారణంగా అధికార భాషా సంఘానికి సంబంధించిన జీవోలు అన్నీ దాదాపు తెలుగులోనే విడుదలవుతుంటాయి. ఇది కొత్తేమీ కాదు.
ఇదివరకు గత ప్రభుత్వాలు కూడా అధికార భాషా సంఘానికి సంబంధించిన జీవోలను తెలుగులోనే విడుదల చేశాయి. ఇందులో ప్రత్యేకత ఏమీ లేనప్పటికీ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంగ్లీష్ లో విద్యా బోధన జరగాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం, దీనిపై సర్వత్రా వెల్లువెత్తుతున్న విమర్శల మధ్య ఈ జీవో విడుదల కావడం ప్రాధాన్యతను సంతరిచుకుంది. ఈ జీవోకు ప్రకారం.. అధికార భాషా సంఘానికి నలుగురిని సభ్యులుగా నియమించారు. మోదుగుల పాపిరెడ్డి, ఆచార్య షేక్ మస్తాన్, ఆచార్య చందు సుబ్బారావు, ఆచార్య శరత్ జ్యోత్స్నారాణి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ జీవోలో ఎక్కడే గానీ ఒక్క ఆంగ్ల అక్షరం గానీ, ఆంగ్ల ఉచ్ఛారణ గానీ లేకుండా ప్రభుత్వ అధికారులు జాగ్రత్త పడ్డారు.