త్వరలో ఏపీఎస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలు- రవాణా మంత్రి పేర్నినాని ప్రకటన...
ఏపీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్టీసీ అంగీకరించిందని, వారి పట్ల పూర్తి సానుభూతితో ప్రభుత్వం ఉందని, త్వరలోనే కారుణ్య నియామకాలను చేపడతామని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
అనంతపూర్, కర్నూల్, తూర్పు గోదావరి, కర్నూల్, కడప, గుంటూరు జిల్లాలకు చెందిన ఆర్టీసీ కారుణ్య నియామక అభ్యర్థులు మంత్రిని కలిసి తమ కష్టాలను ఏకరువు పెట్టారు. తమ తండ్రులు, భర్తలు ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో అకాల మృత్యువు పాలయ్యారని, గత కొంత కాలంగా కారుణ్య నియామకాలు లేకపోవటంతో తాము ఎంతో ఇబ్బందులకు గురవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో 78 మంది, రాష్ట్రంలో 910 మంది కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్నారని మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి పేర్నినాని... త్వరలోనే వీటి భర్తీ ఉంటుందని వారికి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకు కారుణ్య నియామకాలు భర్తీ చేయాల్సి ఉంది.
ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్టీసీ ఇబ్బందుల్లో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు తిప్పే పరిస్థితి లేదు. అయినా ఉద్యోగుల కుటుంబాల పట్ల సానుభూతితో త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి ఇచ్చిన హామీపై వారు సంతోషం వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నట్లు వారు తెలిపారు.