ఈ నెల 7నుంచి ఏపీలో సిటీ బస్సులు- కేంద్రం వెసులుబాటుతో ఆర్టీసీ ఏర్పాట్లు..
కరోనా వైరస్ వ్యాప్తి మొదలయ్యాక దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో ఏపీలోనూ దాని ప్రభావం పడింది. ఆర్టీసీ దూరప్రాంతాలకు నడిపే బస్సులతో పాటు స్ధానికంగా సిటీ బస్సు సర్వీసులను కూడా రద్దు చేసింది. అన్లాక్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత పల్లెవెలుగు బస్సులతో పాటు దూర ప్రాంత సర్వీసులు కూడా మొదలయ్యాయి. అంతర్ రాష్ట్ర సర్వీసుల్లో తెలంగాణ మినహా మిగిలిన రాష్ట్రాలకు సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణకు కూడా బస్సులు నడిపే అంశంపై ఆర్టీసీ చర్చలు జరుపుతోంది.
అదే సమయంలో స్ధానికంగా ప్రజా రవాణా మెరుగుపడటం, కేంద్రం ఆన్లాక్ మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు విడుదల చేస్తుండటంతో వీటి ఆధారంగా సిటీ బస్సు సర్వీసులను కూడా పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ప్రభుత్వం కూడా వీటిని ఆమోదించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుస్తోంది. దీంతో ఈ నెల 7 నుంచి విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో సిటీ బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.
ఆర్టీసీ ప్రస్తుతం దూర ప్రాంత సర్వీసులు నడుపుతున్నా కరోనా భయాలతో ఎక్కువ సేపు బస్సు ప్రయాణాలకు జనం ఇష్టపడటం లేదు. తప్పనిసరి అయితేనే ప్రయాణాలు చేస్తున్నారు. కానీ సిటీ బస్సుల్లో అయితే తక్కువ దూరమే కాబట్టి జనం మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి.
Recommended Video
అదే సమయంలో ప్రజారవాణా మెరుగుపడినందున సిటీ సర్వీసులకు కూడా ఆదరణ ఉంటుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. అందుకే ఈ నెల 7 నుంచి సిటీ సర్వీసులు నడిపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.