మారిన ప్రాధాన్యత: నో వైజాగ్..ఓన్లీ విజయవాడ: ఆ వేడుకలు ఈ సారీ ఇక్కడే: చురుగ్గా ఏర్పాట్లు
విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వం అందరి అంచనాలను మరోసారి తలకిందులు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఈ సారి పరిపాలనా రాజధానిగా రూపుదిద్దుకోనున్న విశాఖపట్నంలో నిర్వహిస్తారంటూ వచ్చిన వార్తలకు తెర దించింది. ఈ సారి కూడా విజయవాడలోనే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ గురువారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. రిహార్సల్స్ను నిర్వహించారు.
రాయలసీమ లిఫ్ట్పై పక్కా వ్యూహంతో జగన్- అపెక్స్ భేటీకి ముందే టెండర్లకు ఏర్పాట్లు...
ఈ ఏడాది విశాఖపట్నంలో పంద్రాగస్టు వేడుకలను నిర్వహించడం ఖాయమంటూ ఇదివరకు అంచనా వేశారు. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించిన అనంతరం.. ఇక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు విశాఖపట్నం సాగర తీరాన నిర్వహించడం ఖాయమంటూ వార్తలు వెలువడ్డాయి.. అనధికారికంగా. రామకృష్ణా బీచ్లో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎగురవేస్తారని భావించారు.
దీన్ని తలకిందులు చేసింది ప్రభుత్వం. ఈ సారి కూడా విజయవాడలోనే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు హాజరయ్యే ఆహ్వానితులు, పరేడ్లో పాల్గొనే శకటాలు.. ఇతరత్రా వ్యవహారాల్లో కోవిడ్ ప్రోటోకాల్, కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో పరిమితంగానే ఆహ్వానాలను పంపించబోతున్నారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ను వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతిబింబించే విధంగా శకటాలను రూపొందించింది ప్రభుత్వం. శకటాల సంఖ్యను కూడా తగ్గించబోతోంది. జెండా పండుగ సందర్భంగా కవాతులో చేపట్టే బ్యాచ్ల సంఖ్యను కూడా తగ్గించారు. భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉండటం వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలను పూర్తిగా రద్దు చేయవచ్చని సమాచారం.
Recommended Video
శనివారం నిర్వహించనున్న జెండా పండుగను దృష్టిలో ఉంచుకుని డీజీపీ గౌతమ్ సవాంగ్ అక్కడి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రిహార్సల్స్ను తిలకించారు. భౌతికదూరాన్ని పాటించేలా ఈ రిహార్సల్స్ నిర్వహించారు. కవాతులో పాల్గొన్న బ్యాచ్ల సంఖ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లను చేపట్టాలని సూచించారు. భౌతికదూరాన్ని పాటించడానకి అవసరమైన స్థలం తక్కువగా ఉండటం వల్ల ఆహ్వానితుల సంఖ్యను కుదించారు.