మంత్రి అనిల్ కుమార్ కి అరుదైన గౌరవం: సీఎం జగన్ కీలక నిర్ణయం: వారి ఎంపికలో ఇక..!
మంత్రి అనిల్ కుమార్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ముఖ్యమంత్రి..ప్రతిపక్ష నేత మాత్రమే ఉండే కీలక కమిటీలో మంత్రి అనిల్ కు అవకాశం లభించింది. సాధారణంగా ఈ అవకాశం కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి లేదా సీనియర్ మంత్రికి ఛాన్స్ దక్కుతుంది. కానీ, తొలి నుండి పార్టీకి గట్టి వాయిస్ గా వ్యవహరిస్తున్న అనిల్ ను సీఎం జగన్ తన కేబినెట్ లోకి ఎంపిక చేసారు. అనూహ్యంగా ఆయన విద్యార్హత.. అనుభవంతో సంబంధం లేకుండా కీలకమైన ఇరిగేషన్ శాఖను అప్పగించారు. అసెంబ్లీ లోపలా..బయటా ప్రతిపక్ష నేత చంద్రబాబు....లోకేశ్.. టీడీపీ మీద విరుచుకుపడే అనిల్ కు ఇరిగేషన్ ద్వారా ప్రతిపక్షాన్ని కార్నర్ చేస్తున్నారు. ఇదే సమయంలో పోలవరం రివర్స్ టెండరింగ్..తిరిగి ప్రాజెక్టు పనుల ద్వారా ఇప్పుడు అనిల్ పైన మరింత బాధ్యత పెరిగింది.
ముఖ్యమైన బాధ్యతలతో..
నెల్లూరు జిల్లా లో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. సీనియర్లను కాదని..సామాజిక సమీకరణాల్లో భాగంగా నెల్లూరు జిల్లాకు ఇరిగేషన్ శాఖను ఇవ్వాలనే ఉద్దేశంతోనే అనిల్ కు ఆ కీలక శాఖను అప్పగించానని నెల్లూరులె రైతు భరోసా ప్రారంభ సభలో సీఎం స్పష్టం చేసారు. అదే విధంగా..సభలో కొన్ని సందర్భాల్లో మంత్రిగా ఉంటూ అనిల్ ప్రదర్శించిన వ్యవహార శైలి మీద విమర్శలు వచ్చాయి. వాటిని సరి చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి సూచనలు చేసారు. ఇక, తనకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ కు అనుచరుడిగా కొనసాగుతానని..తనకు ఇక ఏదీ వద్దని సీఎం సమక్షంలో మంత్రి అనిల్ భావోద్వేగానికి గురయ్యారు. కానీ, ఇప్పుడు ముఖ్యమంత్రి మరోసారి అనిల్ కు తాను ఇస్తున్న ప్రాధాన్యత ఏంటనేది స్పష్టం చేస్తూ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కీలక కమిటీలో సభ్యుడిగా..
రాష్ట్ర ప్రధాన సమాచార కమీషనర్ మరియు ఇతర సమాచారం కమిషన్ సభ్యుల నియామకానికి సంబంధించిన కమిటీలో కేబినెట్ కోటా నుంచి ఇరిగేషన్ శాఖా మంత్రి పాలుబోయిన అనీల్ కుమార్ కి స్థానం కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాధారణంగా ఈ కమిటీలో ముఖ్యమంత్రితో పాటుగా ప్రతిపక్ష నాయకుడు...అధికార పార్టీ నుండి ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉప ముఖ్యమంత్రి లేదా సీనియర్ మంత్రికి ఇప్పటి వరకూ అవకాశం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోంది. దానిని పక్కన పెట్టి.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ లో అనిల్ కు ఈ అవకాశం కల్పించారు.
వైయస్..చంద్రబాబు హయాంలో..
సమాచార హక్కు కమిషనర్ గా ఎంపిక సమయంలో నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష నేత చంద్రబాబు..సీనియర్ మంత్రి రోశయ్య సభ్యులుగా ఉండేవారు. ఇక, చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత జగన్..డిప్యూటీ సీఎం కెఈ క్రిష్ణమూర్తితో పాటుగా సీనియర్ మంత్రి యనమల సభ్యులుగా వ్యవహరించే వారు. అయితే, నాడు చంద్రబాబు రెండు దఫాలుగా ఈ సమావేశం ఏర్పాటు చేసి..జగన్ కు ఆహ్వానం పంపినా..నాడు ప్రతిపక్ష హోదాలో జగన్ హాజరు కాలేదు. ఇక, ఇప్పుడ జగన్..కొత్తగా సమాచార హక్కు కమిషనర్ ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బీసీ వర్గానికి చెందిన అనిల్ కు స్థానం కల్పించి కొత్త సమీకరణాలను తెర లేపారు.