నామినేటెడ్ పోస్టుల్లోనూ రిజర్వేషన్లు: ఉత్వర్వులు జారీ: ఏ వర్గానికి ఎంత మేర ఇవ్వాలంటే..!
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. మరోవైపు నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి విధివిధానాలు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చట్టం ప్రకారం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ శాఖల పరిధిలోని అన్ని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, బోర్డులు, సొసైటీలు, కమిటీలను యూనిట్లుగా పరిగణిస్తారు. వీటి అమలు, పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో నోడల్ ఏజెన్సీ వ్యవహరిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ఆమోదించారు. ఇప్పుడు ఈ ఉత్తర్వుల ద్వారా ఒక నుండి ఇచ్చే నామినేటెడ్ పోస్టుల్లో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అమలు కానుంది.
ఏ వర్గానికి ఎంత మేర
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇక నామినేటెడ్ పోస్టుల్లోనూ అమలు కానుంది. అందులో భాగంగా 50 శాతం రిజర్వేషన్లను బీసీ..ఎస్సీ..ఎస్టీ..మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించారు. 50 శాతం రిజర్వేషన్లలో బీసీ, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం పదవులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అంతేకాకుండా... ఈ 50 శాతం రిజర్వేషన్లలో 50 శాతాన్ని మహిళలకు కేటాయించింది. అన్ని ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఈ రిజర్వేషన్లు వర్తించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో స్పష్టం చేసారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగు పూర్తయింది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కేవలం టీటీడీ బోర్డు..రాష్ట్ర స్థాయి ఛైర్మన్ పోస్టులు మినహా మిగిలిన వాటిని భర్తీ చేయలేదు. పోటీ ఎక్కువగా ఉండటం.. స్థానిక సంస్థల ఎన్నికల మీద కసరత్తు జరుగుతున్న సమయంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వటం కంటే మరి కొంత కాలం ఆగటం మంచిదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. టీటీడీ బోర్డులో రిజర్వేషన్లు అమలు చేయకపోవటం పైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా రిజర్వేషన్ ప్రక్రియ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
త్వరోలనే పోస్టుల భర్తీ..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ గురించి ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. తొలుత మంత్రి వర్గ సమావేశం తరువాత మంత్రులు నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాన్ని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించారు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తరువాత చేపడదామని సీఎం జగన్ స్పష్టం చేసారు. అయితే..మంత్రులు .. ఎమ్మెల్యేల తమ మీద కేడర్ ఒత్తిడి తెస్తోందని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కోరారు.
కేటగిరీకి ఎంత శాతం
దీనికి సంబంధించి జిల్లాల వారీగా నివేదికలు సిద్దం చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు మేరకు ఇన్ ఛార్జ్ మంత్రులు జాబితా సిద్దం చేయాలని ప్రభుత్వం నుండి సూచనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ యాభై శాతం రిజర్వేషన్లలో ఏ కేటగిరీకి ఎంత శాతం ఇవ్వాలనే దాని పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీంతో..ఇక పోస్టుల ఎంపిక సమయంలోనూ అదే విధంగా నేతలు సైతం జాబితాలను సమర్పించాల్సి ఉంటుంది. దసరా సందర్భంగా కొన్ని పోస్టులను మంజూరు చేసే అవకాశం ఉందని ఆశావాహులు అంచనా వేస్తున్నారు.