విజయవాడ అగ్ని ప్రమాదం: జగన్ సర్కార్ సీరియస్: కలెక్టర్లకు అదనపు బాధ్యతలు?
విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనలో 11 మంది మరణించడం పట్ల ప్రభుత్వ వర్గాలు, అధికార యంత్రాంగం మొత్తం విస్తు పోతోంది. ఈ ఘటనలో మంటల్లో చిక్కుకుని మరణించిన వారి కంటే కూడా ఊపిరి ఆడక ప్రాణాలను వదిలిన వారే అధికంగా ఉండటం వల్ల నివ్వెర పోతోంది. తక్షణ చర్యలను తీసుకోవడానికి సమాయాత్తమౌతోంది.
విమర్శలకు తావిచ్చేలా..
విజయవాడ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనంటూ ఇప్పుడిప్పడే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనలో మరణించిన 11 మంది కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రకటించాలని, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. రాష్ట్రంలోని అన్ని కోవిడ్ కేర్ సెంటర్ల భద్రతను సమీక్షించాలంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వానికి సూచించారు.
అన్ని కోవిడ్ సెంటర్ల భద్రతపై
రాష్ట్రంలోని అన్ని కోవిడ్ కేంద్రాల భద్రతను సమీక్షించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికోసం అత్యవసరర సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చని అంటున్నారు. హోం, మున్సిపల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి.. కోవిడ్ సెంటర్ల నిర్వహణ, వాటి భద్రతా ప్రమాణాలను సమీక్షించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
వందల సంఖ్యలో
ప్రస్తుతం రాష్ట్రంలో వందలాది సంఖ్యలో కరోనా వైరస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. గ్రామ, మండల స్థాయిలో కోవిడ్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. వాటి ద్వారా కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లకు చికిత్స అందిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతో పాటు కొన్ని ప్రైవేటు భవనాల్లోనూ కోవిడ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. స్వర్ణ ప్యాలెస్ హోటల్ కూడా అలాంటిదే. చాలా చోట్ల ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల భవన సముదాయాల్లోనూ కోవిడ్ కేంద్రాలు కొనసాగుతున్నాయి.
వాటిల్లో భద్రతపై
ఆయా కోవిడ్ కేంద్రాల భద్రతను పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీని కూడా నియమించవచ్చని అంటున్నారు. సీనియర్ ఐఎఎస్ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ కమిటీ పనిచేసేలా ఏర్పాటు చేస్తుందని, కోవిడ్ కేర్ సెంటర్ల నిర్వహణతో ముడిపడి ఉన్న అన్ని శాఖల అధికారులను అందులో భాగస్వామ్యులను చేస్తుందని చెబుతున్నారు. అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటే.. పేషెంట్లను వెంటనే సురక్షితంగా బయటికి తీసుకు వచ్చేలా.. లేదా వారే స్వయంగా ప్రాణాలతో బయట పడేలా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
Recommended Video
11కు చేరిన మరణాలు
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట నలుగురు మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ సంఖ్య ఏడుకు పెరిగింది. తాజాగా మరో ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు. కొద్దిసేపటి తరువాత మరో ఇద్దరు మృత్యవాత పడ్డారు. దీనితో స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది.