జగన్ నిర్ణయాలతో నిరాశ: అవసరానికి మించి సలహాదారులు.. భారీగా వేతనాలు: బాబు బాటలోనే..!
వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతీ నిర్ణయం పారదర్శకంగా..ప్రతీ రూపాయి ప్రజావసరాల కోసమే ఖర్చు చేస్తామని ప్రకటించారు. అయితే, గతంలో చంద్రబాబు చేసిన విధంగానే ఇప్పుడు జగన్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు అవసరానికి మించి..అయినవారికి పదవులు కట్టబెట్టేందుకు సలహాదారులుగా అవకాశం కల్పించారు. ఇక, నామినేటెడ్ పోస్టుల పేరుతో రకరకాల పదువలు కట్టబెట్టారు. ఇప్పుడూ అదే జరుగుతోంది. ప్రభుత్వంలో తమకు కావాల్సిన వారిని అవసరమైన పదవుల్లో నియమించుకోవటం సాధారణం. కానీ, నాడు చంద్రబాబు ..ఇప్పుడు జగన్ మాత్రం తమకు కావాల్సిన వారికి సలహాదారుల పోస్టులు ఇవ్వటం సర్వ సాధారణంగా మారిపోయింది. అయితే..ఇప్పుడు జగన్ గతంలో తనకు దగ్గరగా ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టటం చర్చకు కారణమైంది. తాజాగా ప్రభుత్వం ఇచ్చిన ఒక సలహాదారుడి పోస్టు కోసం ఇప్పటి వరకు లేని పోస్టును క్రియేట్ చేసారు.
జగన్ ప్రభుత్వంలో వారిని సలహాదారులుగా..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు తీసుకున్న తరువాత అజయ్ కళ్లాం.. శామ్యూల్.. సజ్జల రామక్రిష్టారెడ్డి వంటి వారిని సలహాదారులుగా నియమించుకున్నారు. వీరి విషయంలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. అదే సమయంలో పార్టీ కోసం పని చేసారనే కారణంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి కీలకమైన మీడియా విభాగంలో పోస్టులు కట్టెబెట్టారు. అందులో ఖమ్మం జిల్లా నుండి ఒకరు ఇప్పుడు ఈ వ్యవస్థలో కీలకంగా ఉన్నారు. అదే విధంగా నేషనల్ మీడియా మరియు ఇంటర్ స్టేట్ ఎఫైర్స్ సలహాదారుడిగా దేవులపల్లి అమర్ ను నియమించారు. తాజాగా ఖమ్మం జిల్లాకే చెందిన సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి కోసం ఇప్పటి వరకు లేని పబ్లిక్ పాలసీ సలహాదారు అనే పోస్టును క్రియేట్ చేసి మరీ అప్పగించారు. ఆయన తెలంగాణ లోని ఖమ్మం జిల్లాకు చెందిన వారు. ఇక, కీలకమైన సమాచార పౌర సంబంధాల శాఖ కీలక అధికారి సైతం తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. దీని ద్వారా ఏపీలో సమర్ధులు లేరా..లేక వీరి మీద మాత్రమే జగన్ కు నమ్మకమా అనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో వీరిని తీసుకున్నా..వారికి సలహాదారుల హోదా ఇవ్వటం అందునా ప్రభుత్వంలోని ముఖ్యుల కంటే భారీగా వేతనాలు ఇవ్వటం మరో రకంగా వ్యతిరేక చర్చకు కారణం అవుతోంది.
అమర్ జీతం రెండు లక్షలు..అలవెన్సులు 1.82 లక్షలు
రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా మరియు ఇంటర్ స్టేట్ ఎఫైర్స్ సలహాదారు 'దేవులపల్లి అమర్'కు నెలకు రూ.3.82 లక్షలు జీతం ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు నెలకు రూ.2లక్షలు జీతం నేరుగా ఇవ్వనుండగా...వ్యక్తిగత సహాయకులకు రూ.70వేలు చెల్లించనుంది. దీనిలో ప్రైవేట్ సెక్రటరీ,పర్సనల్ అసిస్టెంట్, ఆఫీస్ బాయ్, కారు డ్రైవర్ల జీతం ఉంది. మొబైల్ ఫోన్ కోసం రూ.2వేలు, ఇంటి అద్దె ప్రతి నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. ఇవి కాకుండా మెడికల్ రీఎంబర్స్మెంట్, సెకండ్ క్లాస్ ట్రైన్ ఛార్జీలతో పాటుగా ఎకానమీ ఫ్లైట్, విదేశీ ప్రయాణం కోసం బిజినెస్ క్లాన్ టిక్కెట్లను ఇస్తారు. మగిలిన సలహాదారులకు దాదాపు అటు ఇటూగా ఇదే మొత్తాలను చెల్లించాల్సి ఉంటుంది. ఇక, ఈ మధ్య కాలంలో అనేక మందికి అనేక పేర్లతో పోస్టులు కట్టబెట్టారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ ప్రజా సొమ్ము ఆదా..పారదర్శకత ఇక్కడ కనిపించటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో అయినా తమ కోసం నిలిచిన వారికి పదవులు ఇవ్వటం సాధారణమే. అయితే, ఇప్పుడు తెలంగాణ నుండి ప్రాధాన్యత ఇవ్వటం పైన ఇక్కడి ఆశావాహుల్లో నిరాశ కనిపిస్తోంది.
టీటీడీ బోర్డులోనూ అదే విధంగా..
టీటీడీ బోర్డులోనూ సాధారణంగా తెలంగాణ నుండి ముగ్గురు ఇతర రాష్ట్రాల నుండి ఒక్కొక్కరు చొప్పున అవకాశం కల్పిస్తారు. కానీ, ఈ సారి ఏపీలోని వారి కంటే తెలంగాణతో సహా ఇతర రాష్ట్ర ప్రతినిధులకు ఎక్కువగా అవకాశాలు దక్కాయి. అధికార పార్టీ నుండి ఎమ్మెల్యేలుగా ముగ్గురికి మాత్రమే చోటు కల్పించారు. దీంతో..టీటీడీ బోర్డు అంటే తెలంగాణ బోర్డు అనే విమర్శలు మొదలయ్యాయి. పార్టీ గెలుపు కోసం పని చేసిన క్షేత్ర స్థాయిలోని వారికి మాత్రం నామినేటెడ్ పదవుల ఊసే లేదు. ఇక, మంత్రి వర్గం లో స్థానం దక్కని సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతోంది. భూమన లాంటి వారు సైతం టీటీడీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతోమంది జగన్ వైపు ఆశగా చూస్తున్నా..నిరాశే కనిపిస్తోంది.