ఏపీలో ఇంగ్లీష్ మీడియంపై పట్టువీడని ప్రభుత్వం- మరో కీలక నిర్ణయం...
ఏపీలో ఈ విద్యాసంవత్సరం నుంచే ఎట్టిపరిస్ధితుల్లోనూ ఇంగ్లీష్ మీడియం అమలు చేసి తీరాలని భావిస్తున్న జగన్ సర్కార్ ఇందుకోసం పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. గతంలో హైకోర్టు వ్యక్తం చేసిన అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం అమలుపై తల్లితండ్రుల అభిప్రాయాలను, ఎస్ఈఆర్ఈటీ వాదనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అమలుపై థర్డ్ పార్టీ సర్వే చేయించాలని నిర్ణయించింది.
ఇంగ్లీష్ మీడియంపై ఏం చేద్దాం ? ఏపీ సర్కార్ సమాలోచనలు- సమీపిస్తున్న గడువు..
అలాగే ఇంగ్లీష్ మీడియం అమలుపై ప్రజల్లో, విద్యార్ధుల్లో, తల్లితండ్రుల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా షార్ట్ ఫిల్మ్ లు రూపొందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
సమగ్ర శిక్షణా అభియాన్ పథకం కింద విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు అన్నింటినీ వీటిలో చూపించబోతోంది. త్వరలో ఈ షార్ట్ ఫిల్మ్ల రూపకల్పన ప్రారంభం కానుంది. జూన్ నెలాఖరు కల్లా వీటిని పూర్తి చేసి జూలై నెలల్లో ప్రజల్లోకి తీసుకెళ్లబోతోంది. ఆగస్టు 3 నుంచి పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి హైకోర్టు అభ్యంతరాలను కూడా అధిగమించి ఇంగ్లీష్ మీడియం అమలు కోసం కొత్తగా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.