ఏపీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్- కీలక వ్యక్తుల పేర్లు ? హైకోర్టుకు పిటిషనర్ అఫిడవిట్..
ఏపీలో విపక్ష టీడీపీ ఆరోపిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వివాదం మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వంలోని పెద్దల పాత్ర ఉందని టీడీపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ ఇవాళ హైకోర్టుకు కీలక అఫిడవిట్ సమర్పించారు. ఇందులో ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు వ్యక్తులు, అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ప్రోద్భలంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పిటిషనర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే తన అఫిడవిట్లో పేర్కొన్న వ్యక్తుల పేర్లను ఈ సమయంలో బయటపెట్టడం సరికాదని లాయర్ శ్రావణ్కుమార్ తెలిపారు.
ఇప్పటికే వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫోన్ ట్యాపింగ్ వివాదంతో సీఎంకు సంబంధం లేదని, ఆయన చుట్టూ కోటరీగా ఉన్న వారి పనేనని ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకు పిటిషనర్ సమర్పించిన అఫిడివిట్లోనూ వారి పేర్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే వీరి పేర్లు బహిరంగంగా వెల్లడిస్తే తీవ్ర కలకలం రేగే అవకాశం ఉండతంతో వాటిని గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్కు కారకులు ఎవరు, వీరు ఏయే రూపాల్లో ట్యాపింగ్ కు పాల్పడ్డారు వంటి అంశాలను పిటిషనర్ తన అఫిడవిట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వీటిపై ఈ నెల 27న జరిగే విచారణలో వివరాలు బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రం పాత్ర లేదని బీజేపీ నేత జీవీఎల్ తేల్చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమకూ సంబంధం లేదని కోర్టుకు చెబుతుందా లేక బాధ్యులపై చర్యలు తీసుకుంటుందా తేలాలంటే ఈ నెల 27 వరకూ ఆగాల్సిందే. అయితే పిటిషనర్ వేసిన అఫిడవిట్ బట్టి చూస్తే ప్రభుత్వాన్ని ఈ వివాదంలో టార్గెట్ చేసేందుకు పకడ్బందీ స్కెచ్ రెడీ చేసినట్లు మాత్రం అర్ధమవుతోంది.