స్వర్ణప్యాలెస్ ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు- డాక్టర్ రమేష్కు మూడు రోజుల కస్టడీ
విజయవాడ స్వర్ణప్యాలెస్లో నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లో అగ్నిప్రమాదం జరిగి 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్త సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చిన రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ను పోలీసు స్టేషన్కు పిలిపించి విచారించకుండా గతంలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
స్వర్ణప్యాలెస్లో నిర్లక్ష్యంగా కోవిడ్ సెంటర్ నడిపి 10 మంది చావుకు కారణమయ్యారన్న ఆరోపణలపై డాక్టర్ రమేష్ను నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2 వరకూ మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. న్యాయవాది సమక్షంలో ఈ విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ నిర్వహించాలని కూడా హైకోర్టు సూచించింది.
స్వర్ణప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొన్నిరోజుల తర్వాత ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన హైకోర్టు దర్యాప్తుతో పాటు ఆయన అరెస్టుపైనా స్టే విధించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు దర్యాప్తును ఎలా అడ్డుకుంటారని హైకోర్టును ప్రశ్నించింది. దర్యాప్తు కొనసాగించుకోవచ్చని, కానీ రమేష్ను పోలీసు స్టేషన్కు పిలిపించి విచారణ చేయొద్దని మాత్రం ఆదేశాలు ఇచ్చింది.