ప్రభుత్వం దివాలా తీసిందా..? ఈ-వేలం ఏంటి: ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభత్వానికి హైకోర్టు నుంచి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గత కొద్దిరోజులుగా ఏపీ సర్కార్కు హైకోర్టు నుంచి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టు మరింతగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములు అమ్మకాలపై దాఖలైన పిటిషన్ను విచారణ చేసిన ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి దిమ్మతిరిగే కామెంట్స్ చేసింది. ప్రభుత్వం దివాలా తీసిందా అంటూ వ్యాఖ్యానించింది. ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు అమ్ముకోవాల్సిందేనా అంటూ ఘాటు ప్రశ్నలు సంధించింది. ఆస్తులు అమ్మి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించింది.
అసలే ఏపీ ఆర్థిక పరిస్థి అంతంతమాత్రంగానే ఉండగా కరోనావైరస్ ఎఫెక్ట్తో దేశంతో పాటు రాష్ట్రంలో కూడా లాక్డౌన్ అమలులోకి రావడంతో ఆర్థిక కార్యకలాపాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రెండు నెలలకు పైగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. రెవిన్యూ లేక అల్లాడిపోయింది. అయితే సంక్షేమ పథకాలకు మాత్రం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతుండటంతో చాలామందిలో పలు అనుమానాలు కూడా తలెత్తాయి. ఇక ఏపీని తిరిగి ఆర్థికపరంగా గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం బిల్డ్ ఏపీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వంకు చెందిన భూములను అమ్మాలనే యోచన చేసింది. ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది.
ఇక బిల్డ్ ఏపీ పథకాన్ని సవాలు చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా దీన్ని మంగళవారం విచారణ చేసింది ధర్మాసనం. ఈ సమయంలోనే ప్రభుత్వంపై పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఏపీలో వేల కిలోమీటర్లు సముద్రతీరం ఉందని అక్కడ ప్రజలు ధనవంతులుగా ఉంటే... ఏపీ ప్రభుత్వం మాత్రం పేదరికంలో ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. లాక్డౌన్ నేపథ్యంలో హడావుడిగా ప్రభుత్వ భూములను వేలం ఎందుకు వేయాల్సి వస్తోందని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం తీర్పుకు అనుగుణంగానే భూముల వేలం ఉండానలి హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రభుత్వ భూములను రక్షించుకోవాల్సింది పోయి ఉన్న భూములను అమ్ముకోవడం ఏమేరకు సమంజసమని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కోరగా ఇందుకు సమయం ఇస్తూ మే 28కి హైకోర్టు విచారణను వాయిదా వేసింది.