ఏపీ సర్కారుకు హైకోర్టులో మరో షాక్- పంచాయతీ ఓట్ల కౌంటింగ్ వీడియో షూట్ తీయాల్సిందే
ఏపీలో వైసీపీ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్గా సాగుతున్న పోరులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వీడియో చిత్రీకరణ చేయాలని గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు ఎస్ఈసీ ఆదేశాలను సమర్ధించింది.
ఉగాది నుంచి జగన్ రచ్చబండ- ముహుర్తం ఖరారు- సంక్షేమం ఫీడ్బ్యాక్ కోసమే
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని విపక్ష పార్టీలు ఎస్ఈసీకి పలు ఫిర్యాదులు చేశాయి. తొలి రెండు దశల పంచాయతీ పోరులో అధికార పార్టీ కౌంటింగ్ను కూడా ప్రభావితం చేసిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ బూత్లో ఓట్ల లెక్కింపును వీడియో చిత్రీకరణ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్రంలో అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణ చేయాలంటే సాంకేతికంగా ఇబ్బందులు ఉన్నాయని, అందుకే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం వీడియో చిత్రీకరణ చేస్తామని హైకోర్టుకు చెప్పింది. అయితే సమస్యాత్మక ప్రాంతాలను ఎలా గుర్తిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సరైన సమాధానం లేకపోవడంతో హైకోర్టు ఇవాళ ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయాలని తీర్పునిచ్చింది. కౌంటింగ్ ప్రక్రియ నిష్పాక్షికంగా జరగాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని ప్రభుత్వానికి తెలిపింది. అయితే ఇందులో ఓ మినహాయింపు మాత్రం ఇచ్చింది. పంచాయతీలో ఉండే ఓటర్ ఎవరైనా కోరితే వెంటనే కౌంటింగ్ను చిత్రీకరించాలని ఆదేశాలు ఇచ్చింది.