సెల్ఫీ కోసం ఆరాటం.. గోవా బీచ్లో జగ్గయ్యపేట డాక్టర్ మృతి
జగ్గయ్యపేట : సెల్ఫీ దిగాలనే ఆరాటం ఓ యువ వైద్యురాలి ప్రాణం తీసింది. సరదాగా స్నేహితులతో కలిసి గోవా బీచ్కు వెళ్లి ఫోటోలు దిగుతున్న సమయంలో అలల రూపంలో మృత్యువు కబళించింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రమ్యకృష్ణ (25సం.) ఎంబీబీఎస్ పూర్తి చేసి స్థానిక ప్రైమరీ హెల్త్ సెంటర్లో కొద్దికాలం పనిచేశారు. అనంతరం మూడేళ్ల కిందట గోవా వెళ్లిన రమ్యకృష్ణ.. అక్కడి ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా ఉద్యోగం చేస్తున్నారు.
పుట్టినరోజుల పేరిట రెచ్చిపోతే అంతే సంగతి.. ఇక జైలుపాలే..!
మంగళవారం నాడు బయటకు వెళదామని ఆరుగురు స్నేహితులతో కలిసి బీచ్కు వెళ్లారు రమ్యకృష్ణ. అయితే సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా అలలు వచ్చాయి. ఆ అలల దాటికి రమ్యకృష్ణతో పాటు ఓ స్నేహితురాలు గల్లంతయ్యారు. తమ కళ్లముందే ప్రమాదం జరగడంతో అక్కడున్నవారు సాయమందించి ఆమె స్నేహితురాలిని కాపాడగలిగారు. అయితే రమ్యకృష్ణ జాడ మాత్రం దొరకలేదు. కొద్దిసేపటి తర్వాత ఆమె మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది.
రమ్యకృష్ణ మరణంతో జగ్గయ్యపేటలో విషాదం నెలకొంది. ఆమె తండ్రి ఊటుకూరి ఆంజనేయులు స్థానిక కోర్టులో గుమాస్తాగా పనిచేశారు. కొద్దికాలం కిందట ఆయన చనిపోయారు. ఇప్పుడు రమ్యకృష్ణ కూడా మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.