బీజేపీ గూటికి ఏపీ నేతలు.. గంగుల సహా మరికొందరు.. జేపీ నడ్డాతో భేటీ
అమరావతి : తెలుగు రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది. ఆపరేషన్ కమలం స్పీడప్ చేస్తూ ఇతర పార్టీల నేతలను పార్టీలోకి లాగుతున్నారు. ఆ క్రమంలో ఏపీకి చెందిన పలువురు నేతలు కాషాయం కండువా కప్పుకున్నారు. కమల తీర్థం పుచ్చుకుని రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ప్రకటించారు. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు.
మాజీ ఎమ్మెల్యే, ఎంపీ ఐన టీడీపీ నేత గంగుల ప్రతాప రెడ్డి, టీడీపీ చిత్తూరు ఓబీసీ సెల్ కార్యదర్శి డి.వెంకయ్య, టీడీపీ దివంగత ఎంపీ లాల్ జాన్ బాషా సోదరుడు టీడీపీ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ షేక్ నిజాముద్దీన్, కావలి జనసేన అభ్యర్థి పసుపులేటి సుధాకర్, ప్రముఖ వ్యాపారవేత్త మజర్ బేగ్, ఆదాయ పన్నుశాఖ విశ్రాంత కమిషనర్ కంచర్ల హరిప్రసాద్ తదితరులు తమ అనుచరగణంతో బీజేపీలో చేరారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పుకొచ్చారు.
తిరుమల లడ్డూ పుట్టిన రోజు.. సోషల్మీడియాలో శుభాకాంక్షలు.. ఇంతకు ఎన్నేళ్లు..!
అనంతరం బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిశారు. ఏపీలో పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలపై కొద్దిసేపు చర్చించారు. రాయలసీమలో సమస్యలు, పరిష్కార మార్గాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశంలో సుపరిపాలన సాధ్యమైందని గుర్తు చేశారు. ఆ క్రమంలో దేశం వేగంగా అభివృద్ది చెందుతోందని.. అందుకే ఆయన విధానాలు నచ్చి ఆ అభివృద్దిలో భాగస్వాములం కావడానికే పార్టీలో చేరినట్లు తెలిపారు. మోడీ నేతృత్వంలో పనిచేయాలనే బలమైన ఆకాంక్షతో కాషాయం కండువా కప్పుకున్నట్లు వివరించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళతామని ప్రకటించారు. ఆ మేరకు శాయశక్తులా పనిచేసి బీజేపీకి అధికారం కట్టబెడతామని చెప్పుకొచ్చారు. బీజేపీలో చేరిన పలువురి నేతలతో పాటు రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల వెంకటేశ్ యాదవ్, ఇతర పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.