రోడ్డున పడేశారు: లిక్కర్ కార్మికులకు పవన్ కళ్యాణ్ భరోసా, రైతుల మొర పట్టదా?
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు విధానాల వల్ల బాధితులైన వారికి అండగా ఉంటామని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ షాప్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శుక్రవారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ను కలిశారు. ప్రైవేట్ షాపులు ఉన్నప్పుడు వాటిలో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకున్న తాము ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పని చేసేందుకు వయసు ఎక్కువ అంటూ అనర్హులుగా చేశారని.. ఫలితంగా 30 వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
కొత్త విధానంలో మద్యం అక్రమంగా బయటకు వెళ్తోంది అని ఎక్కడా బెల్ట్ షాపుల అమ్మకాలు తగ్గలేదని.. కొత్త విధానంతో తమ చిన్న జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయన్నారు. వీరి సమస్యలను విన్న పవన్ కళ్యాణ్.. వయో పరిమితి, విద్యార్హత అంటూ చిరుద్యోగులను తొలగించడం భావ్యం కాదన్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం కూడా వీరికి అండగా ఉండాలన్నారు.
రైతులను ఆదుకోవాలి: పవన్
భారీ వర్షాలతో కోస్తా ప్రాంతంలో రైతులు తీవ్రంగా నష్టపోయి కష్టాల్లో ఉన్నారు. ఈసారి పంట దిగుబడి బాగుంటుందని ఆశపడుతున్న సమయంలోనే పంట నీట మునగడంతో వరి సాగు చేసే రైతాంగం నైరాశ్యంలోకి వెళ్లింది. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ పాలక వర్గం ఆ బాధ్యతను విస్మరించినట్లు కనిపిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.
ధాన్యం రాశులతో కళకళలాడే గోదావరి జిల్లాలు ఇప్పుడు కళ తప్పి పంట వెన్నువాలి ఉన్నాయి. ఈ జిల్లాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయింది. ఈ జిల్లాలతోపాటు ఉత్తారంధ్ర, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నా ఇప్పటి వరకూ వ్యవసాయ, రెవెన్యూ శాఖలు నష్టంపై ప్రాథమిక అంచనాలకు కూడా రాలేకపోయాయంటే ప్రభుత్వానికి రైతులపై ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పంట నష్టాన్ని పూర్తిగా ప్రభుత్వమే భర్తీ చేయాలి. ఈ మేరకు తక్షణమే ప్రభుత్వం ప్రకటన చేయాలని పవన్ కళ్యాన్ డిమాండ్ చేశారు.