నా మాటల్ని అపార్ధం చేసుకున్నారు - నోటీసు వెనక్కి తీసుకోండి- ఎస్ఈసీకి కొడాలి నాని వినతి
ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీగా సాగిపోతున్న వార్ ఇవాళ కూడా కొనసాగింది. ఇవాళ ఉదయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను ఉద్దేశించి పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు షోకాజ్ నోటీసులు అందాయి. దీంతో వీటికి ఆయన వివరణ ఇచ్చారు. తాను కమిషన్కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
కొడాలి కామెంట్స్పై నిమ్మగడ్డ సీరియస్- రెచ్చగొట్టే వ్యాఖ్యలపై షోకాజ్ నోటీసు- వివరణకు డెడ్లైన్
ఎస్ఈసీ నిమ్మగడ్డ జారీ చేసిన షోకాజ్ నోటీసులో తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు అవాస్తవమని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. రాజ్యాంగ బద్ధ సంస్ధలంటే తనకు ఎంతో గౌరవమని, ముఖ్యంగా ఎస్ఈసీ అంటే తనకు గౌరవమని మంత్రి కొడాలి పేర్కొన్నారు. తాను ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదని కొడాలి నాని తెలిపారు. తద్వారా తన వ్యాఖ్యల్ని ఎస్ఈసీ అపార్ధం చేసుకున్నారనే అర్ధం వచ్చేలా కొడాలి సమాధానం ఇచ్చారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు, టీడీపీ అరాచకాల్ని వివరించడానికే ప్రెస్మీట్ నిర్వహించానని, ఉద్ధేశపూర్వకంగా ఎస్ఈసీని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొడాలి తెలిపారు.
అంతకు ముందు ఉదయం నిర్వహించిన ప్రెస్మీట్లో చంద్రబాబు, నిమ్మగడ్డ ఎవరు అడ్డొచ్చినా పంచాయతీ ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగానే ఉంటాయని, వీరంతా జగన్నాధ రథ చక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని కొడాలి వ్యాఖ్యానించారు. దీంతో ప్రెస్ మీట్ ముగిసిన గంటలోనే ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నాని ఇచ్చిన వివరణ ఆధారంగా తదుపరి చర్యలను ఎస్ఈసీ నిమ్మగడ్డ ఖరారు చేసే అవకాశముంది.