మంత్రి వెల్లంపల్లికి కరోనా వైరస్, ఇటీవల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్తో కలిసి..
ఆంధ్రప్రదేశ్ దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు కరోనా వైరస్ పాజిటివ్ సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్ రావడంతో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో చాలా మంది ప్రజాప్రతినిధులు కరోనా వైరస్ బారినపడి.. కోలుకున్నారు. తాజాగా మంత్రి వెల్లంపల్లికి కరోనా సోకింది.
అంతర్వేది రథం: ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి, అధికారులకు మంత్రి వెల్లంపల్లి ఆదేశాలు
తిరుమలలో వారం రోజులు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజుల పాటు తిరుమలలో ఉన్నారు. ఈనెల 25వ తేదీన విజయవాడకు రాగా.. అప్పటి నుంచి స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో మంత్రికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో మంత్రి వెల్లంపల్లి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అయితే బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్తో కలిసి మంత్రి వెల్లంపల్లి పాల్గొన్నారు.
జగన్ సమీపంలో మంత్రి..
స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమంలో సమీపంలో ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంలో ఉన్నారు. సీఎం జగన్ హైదరాబాద్ బయల్దేరే సమయంలో కూడా సమీపంలో ఉన్నారు. మంత్రి వెల్లంపల్లికి కరోనా వైరస్ సోకడంతో.. సీఎం జగన్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. అయితే బ్రహ్మోత్సవాలు జరిగి.. చాలారోజులవుతుందని... ఆ సమయంలో మంత్రికి వైరస్ సోకి ఉండకపోవచ్చు అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
పెరుగుతున్న పాజిటివ్ కేసులు
ఇటు ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం 6 వేల 923 పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 6 లక్షల 75 వేల 674కి చేరింది. కరోనా వైరస్ సోకి 45 మంది చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 5 వేల 708కి చేరింది. గత 24 గంటల్లో 7 వేల 796 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6 లక్షల 5 వేల 90కి చేరింది. ప్రస్తుతం 64 వేల 876 యాక్టివ్ కేసులు ఉన్నాయి. శనివారం 76 వేల 416 శాంపిల్స్ పరీక్షించగా.. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 56 లక్షల 202కి చేరింది.