రాజధాని మార్పు వివాదం నుంచి ఎస్కేప్ ప్లాన్? బొత్సా వ్యాఖ్యలతో జగన్ కు సంబంధం లేదా..?
ఏపీలో సంచలనానికి కారణమైన మంత్రి బొత్సా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రికి సంబంధం లేదా. ఇప్పుడు అవుననే సమాధానం వస్తోంది. ముఖ్యమంత్రికి తెలియకుండానే మంత్రి రాజధాని మీద అంత కీలకంగా వ్యాఖ్యలు చేస్తారా అనేది జరుగుతున్న చర్చ. అయితే, ముఖ్యమంత్రికి సంబంధం లేదని..బొత్సా సైతం అక్కడ ఉన్న పరిస్థితినే వివరించారు కానీ.. రాజధాని మార్పు గురించి చెప్పలేదని వివరిస్తూ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టింది. దీంతో.. బొత్సా మాటలను తప్పు బట్టకుండానే ప్రజల్లో రాజధాని తరలింపు పైన ఉన్న అపోహలను తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతిలో జరిగిన అక్రమాల ను మరో గుర్తు చేస్తూనే..రాజధానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు. రాజకీయంగా అధికార పార్టీ పైన అన్ని పక్షాలు మూకుమ్మడిగా దాడికి కారణమైన ఈ వ్యాఖ్యల విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా అయినా మంత్రులను రంగంలోకి దించింది. ఇందులో బాగంగానే..జగన్ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ బుగ్గన అదే రకంగా ఫైర్ బ్రాండ్ కొడాలి నాని రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన నుండి రాగానే దీని పైన మరింత స్పష్టత ఇవ్వనున్నారు.
బొత్సా వ్యాఖ్యలతో ముఖ్యమంత్రికి సంబంధం లేదంటూ..
మున్సిపల్ మంత్రి బొత్సా సత్యనారాయణ రాజధాని అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలానికి కారణమయ్యాయి. రాజధాని తరలిస్తున్నారనే ప్రచారం మొదలైంది. అన్ని రాజకీయ పక్షాలు ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసాయి. అయితే, బొత్సా దీని పైన తరువాత వివరణ కూడా ఇవ్వకపోవటంతో ముఖ్యమంత్రి సూచనల మేరకే మంత్రి అలా వ్యాఖ్యానించి ఉంటారనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రికి తెలియకుండా కీలక అంశాల మీద మంత్రి బొత్సా ఆ విధంగా స్పందిస్తారా అంటూ రాజకీయ నేతలు ప్రశ్నించారు. అయితే, దీని పైన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఎటువంటి వివరణ రాలేదు. అయితే, అమెరికా పర్యటనలో ఉన్న జగన్ కు ఇక్కడ జరుగుతన్న పరిణామాలను అధికారులు వివరించే ఉంటారు. అయితే, మంత్రులు ఒక్కో విధంగా స్పందించటంతో మరింత అయోమయం ఏర్పడింది. అయితే, పార్టీల కంటే ప్రజల్లో అమరావతి అంశం పైన పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చను గుర్తించింది. దీంతో..వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో బొత్సా వ్యాఖ్యలను తప్పు బట్టటం..ఖండించటం వంటివి చేయకుండా బొత్సా రాజధాని తరలింపు పైన మాట్లాడలేదని.. కేవలం అమరావతిలో పరిస్థితులు.. ఖర్చు గురించి మాత్రమే వివరిస్తూ శివరామక్రిష్ణన్ చేసిన సూచనల గురించి మాత్రమే చెప్పుకొచ్చారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు.
రాజకీయంగా భిన్న వాదనలు..
మంత్రి బొత్సా చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడా రాజధాని తరలిస్తామని..మార్పు చేస్తామని చెప్పలేదు. కానీ, రాజధాని గురించి చర్చిస్తున్నామని..ప్రకటన చేస్తామని చెప్పిన అంశమే చర్చకు కారణమైంది. అయితే, ఇంత చర్చ జరుగుతున్న సమయంలో అదే మంత్రితో వివరణ ఇప్పించి ఉంటే ఇంత చర్చ ఉందేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక, ఈ అంశాన్ని టీడీపీ..బీజేపీతో పాటుగా అనేక మంది నేతలు ప్రభుత్వం పైన..వ్యక్తిగతంగా జగన్ పైన విమర్శలకు అవకాశం గా మలచుకున్నారు. బీజేపీ నేతలు సైతం సీరియస్ గా స్పందించారు. ముఖ్యమంత్రి జగన్ రాజధాని పైన తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేసారు. రైతులు వేలాది ఎకరాలు ప్రభుత్వానికి అప్పగించిన తరువాత..నిర్మాణాలు కొన్ని జరిగిన తరువాత ఇప్పుడు రాజధాని మారుస్తారనే ప్రచారం అక్కడ భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళనకు కారణమైంది. దీని పైన రైతుల పక్షాన నిలబడుతామని..రాజధాని మార్చాలని చూస్తే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. దీంతో..అసలు ప్రభుత్వం ఆలోచన ఏంటో స్పష్టత లేక.. ఎలా స్పందించాలో తెలియక అయోమయం లో ఉన్నారు. ఇక, జరుగుతున్న పరిణామాలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది. మంత్రులు స్పష్టంగా అమరావతి విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఇందు కోసం రాజధాని విషయం లో ఏం జరిగిందో వివరిస్తూనే..తమ వైఖరి పైన స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
రంగంలోకి బుగ్గన.. కొడాలి నాని
రాజధాని మార్పు అంటూ జరుగుతున్న ప్రచారం తో రాయలసీమ నుండి కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. రాజధాని ప్రాంత నేతలు మాత్రం రాజధాని మార్పు లేదని స్పష్టంగా చెబుతున్నారు. దీని పైన మరింత కాలం చర్చ సాగితే అది రాజకీయంగా నష్టం చేస్తుందని వైసీపీ గ్రహించింది. దీంతో..మంత్రి మేకపాటి గౌతం రెడ్డి రాజధాని అమరావతి నుండి మార్చే అవకాశం లేదని స్పష్టత ఇచ్చారు. బొత్సా చేసిన వ్యాఖ్యలను ఎవరికి తోచిన రీతిలో వారు అర్దం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఇక, రాజధాని జిల్లాకు చెందిన మంత్రి కొడాలి నాని అమరావతి గురించి సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. బొత్సా సైతం ఎక్కడా రాజధాని మార్పు గురించి చెప్పలేదని..ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇక, ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ గా ఉన్న బుగ్గన దీని పైన క్లారిటీ ఇచ్చారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని .. అదే సమయంలో డెవలప్ మెంట్ మొత్తం ఒకటే చోట ఉండటం కూడా సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. రాజధానిలో జరిగిన అక్రమాలను మాత్రం వదిలేది లేదని తేల్చి చెప్పారు. అక్రమంగా జరిగిన భూ కేటాయింపుల పైన విచారణ చేస్తామని స్పష్టం చేసారు. దీని ద్వారా రాజధాని అంశం పైన కొంత వరకు ప్రభుత్వంలోని మంత్రులు ఇచ్చిన వివరణతో వ్యవహారం సద్దు మనుగుతుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి తిరిగి వచ్చిన తరువాత దీని పైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.