తండ్రి వాచీ..మౌంట్ బ్లాక్ పెన్ను..ఓపెన్ టాప్ జీపు: అచ్చం తండ్రి లాగానే..జగన్ స్పెషల్..!
2014 మే 14..2009 మే 20...ఈ రెండు సందర్భాలూ ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ ప్రమాణ స్వీకారం చేసిన రోజులు. అదే విధంగా 2019 మే 30..ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం. ఈ రెండు సందర్భాల్లో నాడు తండ్రి.. నేడు తనయుడు. అచ్చం నాడు వైయస్ ఏరకంగా అయితే జనం సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసారో.. అదే విధంగా తండ్రిని గుర్తు చేస్తూ ముందుకు సాగిన జగన్...ఏం చేసారో తెలుసా..
తండ్రి వాచీ..పెన్నుతోనే..
నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం..ముఖ్యమంత్రిగా వాడిన వాచీ...పెన్నుతోనే ఇప్పుడు జగన్ సైతం తొలి సంతకం చేసారు. ప్రమాణ స్వీకారం కోసం ఇంటి వద్ద నుండి కుటుంబ సభ్యులతో బయల్దేరిన సమయం నుండి తొలి ప్రసంగం..తొలి సంతకం వరకూ అంతా తన తండ్రి తరహాలోనే కనిపించారు. వేదికపై ఆద్యంతం దివంగత వైఎస్సార్ శైలిలోనే హావభావాలు.. ప్రసంగం తీరు సైతం ఆయన్నే జ్ఞప్తికి తెస్తూ సాగిన వైనం పార్టీ శ్రేణులు, అభిమాను లను ఆకట్టుకుంది. సీఎం జగన్ హావభావాలు, మాట విరుపు, ప్రసంగం, తొలి సంతకం, సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడం .. ఇలా అన్నీ వైఎస్ రాజశేఖరరెడ్డిని తలపించాయి.2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారానికి..జగన్ ప్రమాణ స్వీకారానికి మధ్య ఎన్నో సారూప్యతలు కనిపించాయి.
తండ్రి తరహాలోనే ఎంట్రీ..
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అదే విధంగా హైదరాబాద్లోని లాల్బహదూర్ శాస్త్రి స్టేడియంలో ఓపెన్టాప్ జీపుపై కలియదిరిగి అభివాదం చేసిన దృశ్యాలు అభిమానుల కళ్లల్లో మరో సారి గుర్తు వచ్చేలా పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు వచ్చిన వైఎస్ జగన్ స్టేడియంలో ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ గ్యాలరీలో కూర్చున్న అశేష అభిమానులకు అభివాదం చేశారు. వైఎస్సార్ వాడిన వాచీని ఇన్నేళ్లూ ఎంతో అపురూపంగా పదిల పర్చుకున్న వైఎస్ జగన్ తాను సీఎంగా బాధ్యతలు చేపట్టేవేళ గురువారం చేతికి కట్టుకోవడం అందర్నీ ఆకట్టుకుంది. 2004 తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్సార్ తాను ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు పైలుపై తొలి సంతకం చేశారు. అదే విధంగా ఇప్పుడు వైఎస్ జగన్ పింఛన్లను నెలకు రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేయడం విశేషం. కాగా, 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేసిన మాంట్బ్లాంక్ పెన్నునే సీఎం జగన్ వినియోగించారు.
నాన్న శైలిలోనే ప్రసంగం
సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తొలి ప్రసంగం తీరు, హావభావాలు అన్నీ కూడా తన తండ్రి శైలిలోనే ఉండటం అందర్నీ ఆకట్టుకుంది. ప్రసంగించేందుకు మైక్ వద్దకు రాగానే.. వైఎస్ మాదిరిగానే సీఎం జగన్ కూడా మైక్పై మెల్లగా టక్ టక్ టక్మని తడుతూ చిరునవ్వులు చిందిస్తూ అందర్నీ కళ్లతోనే పలకరించారు. అనంతరం ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తన సహజశైలిలో ..తన తండ్రి వైఎస్ శైలిలో రెండు చేతులు ఎత్తి నమస్కరించడంతో సభికులందరి కళ్ల ముందు ఒక్కసారిగా వైయస్ను గుర్తు చేసారు. ఇక ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఆయన హావభావాలు... రెండు చేతులు చాచి మాట్లాడటం.. అంతలోనే రెండు చేతులు ఎదురుగా చూపుతూ మాట్లాడటం పూర్తిగా వైఎస్నే జ్ఞప్తికి తెచ్చింది. జగన్ ప్రసంగిస్తున్న సమయంలో కూడా ఆయన తమ మాటలకు అనుగుణంగా హావభావాలు ప్రదర్శించారు.