ఏపీలో న్యూ ఎక్సైజ్ పాలసీ.. 1 నుంచి అమలు, ప్రజలు అభ్యంతరం తెలిపితే నిలిపేస్తాం...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలవుతుందని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి ప్రకటించారు. ఆయా మద్యం షాపుల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరం వ్యక్తమైతే పరిశీలించి నిలిపివేస్తామని స్పష్టంచేశారు. రాత్రి 9 గంటల తర్వాత మద్యం షాపులు మూసివేస్తామని తేల్చిచెప్పారు.
ఎస్సై, సీఐలకు..
మద్యం షాపుల పర్యవేక్షణ బాధ్యతలను ప్రతీ సీఐ, ఎస్సైకి పది షాపులు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 3 వేల 500 ప్రభుత్వ మద్యం షాపులుఏర్పాటవుతాయని చెప్పారు. ఆగస్టులో 475 ప్రభుత్వ మద్యం షాపులను ప్రారంభించామని గుర్తుచేశారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నామని మంత్రి నారాయణ స్వామి తెలిపారు.
రాత్రి 9 గంటల వరకే..
మద్యం సాఫులు ప్రతీ రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పనిచేస్తాయని స్పష్టంచేశారు. టీడీపీ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయంగా భావించిందన్నారు. 4380 దుకాణాల పరిధిలో పది బెల్ట్షాపులను ప్రోత్సహించారని విమర్శించారు. బెల్ట్ షాపు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 2 వేల 872 నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు వివరించారు. 2 వేల 928 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేశామని,, సారాయి తయారీ, అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
బార్ల సమయం కూడా..
మద్యం ధరల విషయంలో ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ స్వామి తెలిపారు. ఇదివరకు రాష్ట్రంలో బార్లు రాత్రి 11 గంటల వరకు కొనసాగేవని.. ఆ సమయాన్ని తగ్గించాలని యోచిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు, ఆధ్యాత్మిక సంస్థలకు చేరువలో మద్యం షాపులు ఉండకూడదనేది ప్రభుత్వ విధాన నిర్ణయమని మంత్రి స్పష్టంచేశారు.